దేశ ఖ్యాతిని చాటిన మహానేత పీవీ

ABN , First Publish Date - 2023-06-29T03:53:58+05:30 IST

ఆర్థిక సంస్కరణలకు మారు పేరుగా నిలిచిన, భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పలువురు మంత్రులు, పలు పార్టీల నేతలు కొనియాడారు.

దేశ ఖ్యాతిని చాటిన మహానేత పీవీ

ఆర్థిక సంస్కరణలకు మారుపేరు మాజీ ప్రధాని.. జ్ఞాన్‌భూమి వద్ద నివాళులర్పించిన మంత్రులు, నేతలు

ఆయనకు భారతరత్న ఇవ్వాలి: మంత్రి తలసాని

నివాళులర్పించేందుకు కేసీఆర్‌ రాలేదెందుకు? సంజయ్‌

పీవీ పోరాట యోధుడు: ఈటల

గాంధీభవన్‌లో నేతల నివాళి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంస్కరణలకు మారు పేరుగా నిలిచిన, భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పలువురు మంత్రులు, పలు పార్టీల నేతలు కొనియాడారు. బుఽధవారం పీవీ 102వ జయంతి సందర్భంగా నెక్లె్‌సరోడ్డులోని పీవీ ఘాట్‌ జ్ఞాన్‌భూమి వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతోనే దేశం ఇప్పుడు ఆర్థికరంగంలో ఈ స్థాయిలో ఉందని, ఇది తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం అని అన్నారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మహామూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, పీవీ తనయ, ఎమ్మెల్సీ వాణీదేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ జ్ఞాన్‌భూమి వద్ద నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని పీవీ చాటారని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని తలసాని డిమాండ్‌ చేశారు. దేశం క్షిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన గొప్ప నాయకుడన్నారు. పీవీని కాంగ్రెస్‌ అవమానిస్తే.. కేసీఆర్‌ ఇంకా అవమానిస్తూనే ఉన్నారని బండి సంజయ్‌ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓట్లు చీల్చేందుకే కేసీఆర్‌, పీవీ జపం చేశారని, ఇప్పుడు నివాళులు అర్పించేందుకు ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఒవైసీ సోదరులు పీవీ ఘాట్‌ను కూల్చేస్తామని హెచ్చరిస్తే కనీసం స్పందించలేదని విమర్శించారు. కేసీఆర్‌ మహారాష్ట్ర వెళ్లి ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అంటుంటే అక్కడి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఆయనది ‘అబ్‌కీ బార్‌ అబ్కారీ సర్కార్‌’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన యోధుడు పీవీ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పీవీ కీర్తిని చాటేందుకు నిధులు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోందని, అయితే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. పీవీ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వారిలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ, కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఉన్నారు. అసెంబ్లీ హాల్లో పీవీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. గాంధీభవన్‌లో పీవీ చిత్రపటానికి పూలమాలు వేసి కాంగ్రెస్‌ నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కుమార్‌రావ్‌ తదితరులు నివాళులు అర్పించారు.

తెలంగాణ ఠీవి మన పీవీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌

‘‘భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు కాపాడారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు, ఇప్పుడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. తన స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు పీవీ, ప్రధానిగా తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ఆయన ప్రదర్శించారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత పీవీకే దక్కుతుంది. ఆయన సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మనపై ఉంది. ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ఠీవి మన పీవీ’ ఆయన స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-29T03:54:02+05:30 IST