Share News

Amaravati: దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:20 AM

విజయవాడ కనకదుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు.

Amaravati: దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన

అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dussehra Sharannavaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుసుందరి దేవి (Sri Lalita Tripusundari Devi) అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు. రాష్ట్ర మంత్రులు వస్తే కనీసం స్వాగతం పలకని ఈవో.. వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు రాచ మర్యాదలు చేయడంపై జనసేన, టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ అవుతోంది.


ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతుండటంతో ఇవాళ(ఆదివారం) పెద్దసంఖ్యలో భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలి వచ్చారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మవారి దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. కొండపై భాగం నుంచి కొండ కింద వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దుర్గగుడిపై నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికారులు నడుచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నవరాత్రుల ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. అనధికారికంగా అంతరాలయ దర్శనాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రూ. 500ల టికెట్లు కొన్న భక్తులు కూడా దుర్గమ్మను దర్శించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. గంటల కొద్ది భక్తులు పడి గాపులతో క్యూ లైన్లు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు తీసుకునే అంతరాలయ దర్శనం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు, దుర్గగుడి సిబ్బంది పోటాపోటీగా దర్శనాలు చేయిస్తున్నారని భక్తులు అంటున్నారు. దర్శనం చేయించడంలో పోలీసులకు, ఆలయ సిబ్బందికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పోలీసులు, దుర్గగుడి సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.


కాగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శనివారం దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది. తెల్లవారుజాము నుంచి క్యూలు కాస్తంత పలచగా కనిపించినా, ఉదయం 10 గంటలు దాటాక భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీవీఐపీ దర్శనాలు అరగంటలో పూర్తవుతుంటే, సామాన్య భక్తులకు నాలుగైదు గంటల సమయం పడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తుల రాక మొదలైంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. శనివారం వారే ఎక్కువగా కనిపించారు. అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి దర్శించుకున్నారు. మహామండపంలోని ఆరో అంతస్థులో రెండు విడతలుగా కుంకుమార్చనలు నిర్వహించారు. మొదటి విడతలో 82 మంది, రెండో విడతలో 75 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల ఆలయ చైర్మన్‌ కుటుంబ సభ్యులు, ఈవో మూర్తి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది అమ్మవారికి ఇచ్చే కానుకల సంఖ్య పెరిగింది. కాగా, మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి కలెక్టర్‌ సృజన, సీపీ రాజశేఖరబాబు ఆలయ ప్రాంగణం మొత్తాన్ని నిత్యం పరిశీలిస్తున్నారు. ఏమైనా లోటుపాట్లు కనిపించినప్పుడు వైర్‌లెస్‌ సెట్‌లో ఆదేశాలు ఇస్తున్నారు.

కాగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తు లకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదేశించారు. ఆదివారం నుంచి 30వేల మంది భక్తులకు పాలు, మజ్జిగ అందిస్తామని, భక్తుల రద్దీ మేరకు లడ్డూలు అందుబాటులో ఉంచుతామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. సామాన్య భక్తులకు సాఫీగా అమ్మవారి దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. శనివారం 18 వేల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు. ఈ సందర్బంగా కనకదుర్గా సౌందర్య లహరి పుస్తకాన్ని అయన అవిష్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..

బరితెగించిన స్మగ్లర్స్.. పోలీసులపై హత్యాయత్నం

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

అడ్డంగా బుక్కయిన కల్తీ కేటుగాళ్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 06 , 2024 | 11:20 AM