Share News

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Oct 21 , 2024 | 02:40 AM

విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

  • ఒక్కరోజే 24 విమానాలకు హెచ్చరికలు

  • అన్నీ ఒట్టివేనని తనిఖీల్లో వెల్లడి

  • వారంలో 90కిపైగా విమానాలకు..

  • గంటలపాటు సర్వీసుల ఆలస్యం.. ప్రయాణికులకు ఇబ్బందులు

న్యూఢిల్లీ, అక్టోబరు 20: విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌, ఎయిరిండియా మొదలైన కంపెనీలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులున్నాయి. వీటితో కలిపి గత వారం రోజుల్లో మొత్తం 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఒట్టివేనని తేలింది. తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు కనిపించలేదు. అయితే, గమ్యస్థానానికి వెళ్లకుండా మార్గమధ్యంలోనే విమానాలను దింపివేయటం, తనిఖీలు చేపట్టటం కారణంగా సర్వీసులు పలు గంటలపాటు ఆలస్యమయ్యాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈ బెదిరింపుల పర్వం మొదలుకావటంతో.. వీటి వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లో వందలాది స్కూళ్లకు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి.

Updated Date - Oct 21 , 2024 | 02:40 AM