Share News

Pongal: 10నుంచి పొంగల్‌ కానుక వస్తువులు.. నేటినుంచి ఇంటింటా టోకెన్ల పంపిణీ

ABN , Publish Date - Jan 07 , 2024 | 08:46 AM

సంక్రాంతి సందర్భంగా రేషన్‌షాపుల్లో బియ్యం కార్డుదారులకు రూ.1000 నగదు, పొంగల్‌ తయారీకి అవసరమయ్యే పచ్చిబియ్యం, చక్కెర, చెరకుగడ తదితర కానుకల పంపిణీకి ప్రజాపంపిణీ, సహకార శాఖ అదికారులు సన్నాహాలు చేపడుతున్నారు.

Pongal: 10నుంచి పొంగల్‌ కానుక వస్తువులు.. నేటినుంచి ఇంటింటా టోకెన్ల పంపిణీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా రేషన్‌షాపుల్లో బియ్యం కార్డుదారులకు రూ.1000 నగదు, పొంగల్‌ తయారీకి అవసరమయ్యే పచ్చిబియ్యం, చక్కెర, చెరకుగడ తదితర కానుకల పంపిణీకి ప్రజాపంపిణీ, సహకార శాఖ అదికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఈనెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2.20లక్షల మంది బియ్యం కార్డుదారులకు ఈ పొంగల్‌ కానుకలను రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్టు సీఎం స్టాలిన్‌(CM Stalin) ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజాపంపిణీ, సహకార శాఖ, ఆహార భద్రతశాఖ అధికారులు రేషన్‌షాపులకు పచ్చిబియ్యం, చక్కెర, చెరకు గడలను తరలిస్తున్నారు. అదే సమయంలో రేషన్‌షాపుల వద్ద పొంగల్‌ కానుకల పంపిణీ సమయంలో రద్దీని నివారించే దిశగా టోకెన్ల పద్ధతి పాటించనున్నారు. ఆదివారం రేషన్‌షాపు సిబ్బంది కార్డుదారుల ఇంటింటీకి వెళ్ళి టోకెన్లు పంపిణీ చేయనున్నారు. ఆ టోకెన్లలో పొంగల్‌ కానుకలు పంపిణీ చేయనున్న తారీఖు, సమయం తదితర వివరాలు ఉంటాయి. ఈ టోకెన్లను మూడు రోజులపాటు పంపిణీ చేయనున్నారు. అదే విధంగా పొంగల్‌ కానుకల పంపిణీ ఈనెల 13 లోగా పూర్తి చేయాలని రేషన్‌షాపుల నిర్వాహకులకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పొంగల్‌ కానుకలతోపాటు ఉచిత చీరలు, ధోవతులను కూడా అందించనున్నారు. రోజూ 300 నుంచి 500 మంది కార్డుదారులకు పొంగల్‌ కానుకలను పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పొంగల్‌ కానుకలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌రూంకు కార్డుదారులు 1967 అనే హెల్ప్‌లైన్‌కు, 18004255901 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా పొంగల్‌ నగదు, కానుకల పంపిణీ చేయనుండటంతో సెలవుదినమైన ఈనెల 12న రేషన్‌షాపులన్నీ పని చేస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 08:46 AM