Share News

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:34 AM

మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్‌, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

Rahul Gandhi : మణిపూర్‌ సమస్యపై పార్లమెంటులో గళమెత్తుతాం

  • సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం

  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

  • మణిపూర్‌పై ప్రధాని ఎప్పుడు

  • మాట్లాడతారు ? : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, జూలై 11: మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్‌, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మణిపూర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. అలాగే, మణిపూర్‌లో పర్యటించి శాంతి స్థాపనకు కృషి చేయాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో సోమవారం పర్యటించిన రాహుల్‌ గాంధీ అక్కడి పలు పునరావాస శిబిరాలను సందర్శించి ప్రజలతో స్వయంగా మాట్లాడారు. ఇందు కు సంబంధించిన వీడియోను గురువారం ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసిన ఆయన..

ఇప్పటికీ ఆ రాష్ట్రం రెండు ముక్కలుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటిదాకా మూడు సార్లు ఆ రాష్ట్రంలో పర్యటించానని.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. మణిపూర్‌లో హింస కొనసాగుతోందని, అమాయక ప్రజలు ప్రాణాపాయంలో ఉన్నారని, వేలాది కుటుంబాలు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నాయని వివరించారు. ఈ పర్యటనలో మూడు జిల్లాల్లోని వేర్వేరు పునరావాస శిబిరాలను సందర్శించిన రాహుల్‌ గాంధీ.. మైతేయులు, కుకీలతో మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ చేసిన పోస్ట్‌కు స్పందించిన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. మణిపూర్‌ సమస్యపై ప్రధాని మోదీ ఎప్పుడు మాట్లాడతారని ప్రశ్నించారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు.

Updated Date - Jul 12 , 2024 | 04:34 AM