Share News

Bihar: బిహారీలు జైకొట్టేదెవరికి? ఎన్డీయేను మళ్లీ ఆదరిస్తారా.. ఇండియా కూటమిని నిలబెడతారా

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:01 AM

ప్రాచీన భారతదేశంలోని మొట్టమొదటి సామ్రాజ్యం మగధ..! అతి పెద్ద విశ్వవిద్యాలయం నలందా..! షోడశజనపదాలు మొదలు.. మౌర్యులు.. ఆ తర్వాతి రాజ వంశాలు ఏలిన ప్రదేశాల్లో మగధతోపాటు..

Bihar: బిహారీలు జైకొట్టేదెవరికి? ఎన్డీయేను మళ్లీ ఆదరిస్తారా.. ఇండియా కూటమిని నిలబెడతారా

  • ఎన్డీయేను మళ్లీ ఆదరిస్తారా.. ఇండియా కూటమిని నిలబెడతారా

ప్రాచీన భారతదేశంలోని మొట్టమొదటి సామ్రాజ్యం మగధ..! అతి పెద్ద విశ్వవిద్యాలయం నలందా..! షోడశజనపదాలు మొదలు.. మౌర్యులు.. ఆ తర్వాతి రాజ వంశాలు ఏలిన ప్రదేశాల్లో మగధతోపాటు.. మిథిల, వైదేహి వంటి రాజ్యాలూ గొప్ప చారిత్రక ఘట్టాలకు నిలువుటద్దాలు..! బిహార్‌ కీర్తికి ఇవి మచ్చుతునకలు. అంతేనా.. ఆధునిక భారతదేశంలోనూ చంపారన్‌ వంటి ఉద్యమాలకు పురిటిగడ్డ..! అలాంటి బిహార్‌లో ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సారి ఉత్కంఠను రేపుతున్నాయి.

ఎన్డీయే వ్యూహాలు ఫలిస్తాయా?

బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) ఎన్నికల బరిలో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్‌జేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. ఒకే ఒక్క సీటు విపక్షానికి దక్కింది. ఈ సారి 400 సీట్లను సాధిస్తామని ఎన్డీయే ధీమా వ్యక్తం చేస్తున్నా.. బిహారీలు ఆ కూటమికి గత ప్రాభవాన్ని తిరిగి ఇస్తారా? లేక ఇండియా కూటమిని ఆదరిస్తారా? అనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ సాగుతోంది. ఈ సారి బీజేపీ తన సిటింగ్‌ స్థానాల్లో(17) పోటీకి సిద్ధమైంది. నితీశ్‌ పార్టీ జేడీయూ కూడా గతంలో గెలిచిన స్థానాల్లోనే పోటీలో ఉంది. ఎల్‌జేపీ ఒక స్థానాన్ని తగ్గించుకుని, ఐదు చోట్ల బరిలో నిలుస్తోంది. మిగతా రెండు స్థానాల్లో మాజీ సీఎం జీతన్‌రామ్‌ మాంఝీ పార్టీ హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ పోటీ చేయనున్నాయి.


అనుకూలాంశాలు..

ఓబీసీల అభ్యున్నతికి ఆద్యుడిగా పేరున్న కర్పూరికి భారతరత్న ఇవ్వడం ఎన్డీయేకు ప్రధానమైన అనుకూలాంశం. ఇక మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో పెద్దగా విభేదాలేమీ లేవు. అయితే.. రామ్‌విలాస్‌ పాసవాన్‌ తనయుడు చిరాగ్‌ పాసవాన్‌కు ఆయన మేనమామ పశుపతి పార్‌సకు మధ్య మొదట్లో సీట్ల విషయంలో విభేదాలు కనిపించాయి. కానీ, తర్వాత పారస్‌ ఈ విభేదానికి తెరదించారు. ‘‘ఆర్‌ఎల్‌జేపీ ఎప్పటికీ ఎన్డీయేలో భాగమే. ఈ సారి 400కు పైగా స్థానాలను ఎన్డీయే గెలుస్తుంది’’ అని తాను మోదీతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. బిహార్‌లో 7 దశల్లో పోలింగ్‌ ఉండడం ఎన్డీయేకు కలిసివచ్చే అంశం. అన్ని దశల్లో మోదీ స్వయంగా ప్రచారానికి వచ్చే అవకాశాలున్నాయి.

ప్రతికూలాంశాలు..

మాటిమాటికీ కూటములను మార్చిన నితీశ్‌కుమార్‌ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారనే ప్రచారం జరుగుతోంది. చిరాగ్‌ పాసవాన్‌ కూడా రామ్‌విలాస్‌ పాసవాన్‌ మాదిరిగా ప్రభావం చూపుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు 2019 మాదిరిగా ఎన్డీయే ఊపు లేదని చెబుతున్నారు. బిహార్‌లో 63ు ఉన్న ఓబీసీలు, 17ు ఉన్న ముస్లింలు సంఘటితంగా ఓటువేసే అవకాశాలున్నాయని.. అదే నిజమైతే.. బీజేపీకి సవాలేనని భావిస్తున్నారు. 2019 మాదిరిగా బిహార్‌లో నరేంద్రమోదీ ఆకర్షణ ఎంతవరకు పనిచేస్తుంది? అనే చర్చ జరుగుతోంది.


‘ఇండియా’లో లుకలుకలే ప్రధాన సమస్య?

ఇండియా కూటమి విషయానికి వస్తే.. ఎన్నికలు అయ్యేదాకా పొత్తు ధర్మం కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలోని పార్టీల మధ్య విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి ఇండియా కూటమిని నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ కొంత వెనక్కి తగ్గింది. ఆర్జేడీకి 26 స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్‌ కేవలం 9 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా ఐదు స్థానాలను వామపక్షాలకు కేటాయించింది. సీపీఐ(ఎంఎల్‌) మూడు చోట్ల బరిలో దిగుతుండగా.. సీపీఐ, సీపీఎంలు చెరో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. 2019లో ఆర్జేడీకి ఒక్కసీటు కూడా దక్కలేదు. ఒకేఒక్క స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

అనుకూలాంశాలు..

కులగణన జరపడం చరిత్రాత్మక అంశం. ఈ నేపథ్యంలో వర్గసమీకరణాలు, ఓబీసీ, మైనారిటీ ఓటర్లపై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. వామపక్షాలకు సిటింగ్‌ ఎమ్మెల్యే స్థానాలు ఉండడంతో.. వారి ఓట్లు కూడా కూటమికే పడే అవకాశాలున్నాయి. ఆర్జేడీ చీఫ్‌ లాలూ తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదునుపెడితే.. విజయం తమదేనని ‘ఇండియా’ భావిస్తోంది.

ప్రతికూలాంశాలు..

సీట్ల పంపిణీతో కాంగ్రెస్‌ ఆశావహులు కొందరు రెబెల్స్‌గా మారారు. మరికొందరు రాజీనామా బాట పట్టారు. బిహార్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడు అజయ్‌సింగ్‌ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న ఔరంగాబాద్‌, పూర్ణియా స్థానాలను ఆర్జేడీకి ఇవ్వడమే అందుక్కారణం. పూర్ణియాలో పప్పూయాదవ్‌ రెబెల్‌గా బరిలో ఉన్నారు. 2019తో పోలిస్తే బిహార్‌లో కాంగ్రె్‌సకు అవకాశాలు ఎక్కువే ఉన్నా అసంతృప్తుల బెడద వేధిస్తోంది.

Updated Date - Apr 24 , 2024 | 06:03 AM