Share News

బెయిల్‌ వచ్చేనా?.. జైలులోనేనా?

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:35 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానం

బెయిల్‌ వచ్చేనా?.. జైలులోనేనా?

కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు..

రేపటితో ముగియనున్న జ్యుడీషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించనుంది. ఈడీ గతనెల 15న హైదరాబాద్‌లో కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! 16న ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. తొలుత ఏడు రోజులు, రెండోసారి మూడురోజులు.. ఇలా మొత్తం 10 రోజులపాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తిహాడ్‌ జైలుకు తరలించింది. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, తల్లిగా తాను తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలను విన్న న్యాయమూర్తి కావేరి భవేజా.. సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్‌ వస్తుందా? లేదా అనే ఉత్కంఠ సర్వాత్రా నెలకొంది. అదేవిధంగా.. కవిత జ్యుడీషియల్‌ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్‌ దొరకక పోతే.. మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరుస్తారు. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ తిరష్కరణకు గురైతే, సాధారణ బెయిల్‌ పిటిషన్‌ విచారణ 20న జరగనుండడంతో.. కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

సీబీఐ విచారణపై ఎల్లుండి వాదనలు

తిహాడ్‌ జైలులో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తిహాడ్‌ జైలులోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు శనివారమే కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీకాల్‌ చేయాలని కోరతూ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్‌ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేట్‌సకో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్‌పై సీబీఐ తరఫున కూడా వాదనలు విన్న తర్వాతే.. ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టంచేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్‌ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సీబీఐని ఆదేశించారు. దీనికి సీబీఐ మూడురోజుల సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా.. సోమ, మంగళ, బుధవారాల్లో రౌస్‌ అవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది. అయితే.. కవితకు మధ్యంతర బెయిల్‌ దొరుకుతుందా? లేదా కస్టడీని పొడిగిస్తారా? సీబీఐ విచారణకు అనుమతి ఇస్తారా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Updated Date - Apr 08 , 2024 | 04:35 AM