Share News

KCR: ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి..

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:38 AM

‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు.

KCR: ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి..

  • పరేషాన్‌ కావద్దు: పార్టీ నాయకులతో కేసీఆర్‌

  • అధినేతను కలిసిన ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

  • పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో

  • ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ

  • మరో నలుగురు నగర ఎమ్మెల్యేలతో కూడా..

  • ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ మంతనాలు

  • మహిపాల్‌రెడ్డి చూపు.. బీజేపీ వైపు?

  • కమలం గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే!

  • ఈడీ తనిఖీలతో ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నేత

  • ఢిల్లీకి రహస్య టూర్‌.. బీబీ పాటిల్‌తో భేటీ

  • ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలు

హైదరాబాద్‌/మర్కుక్‌/ఉప్పల్‌, జూన్‌ 26: ‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికార దాహంతో, స్వార్థంతో పార్టీ వీడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్‌), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజి గిరి), కాలేరు వెంకటేశ్‌ (అంబర్‌పేట), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్‌), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌) కేసీఆర్‌ను కలిశారు.


పలువురు నగర ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ స్‌ను వీడి కాంగ్రె్‌సలో చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ఐదుగురూ కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి పార్టీ మారతారని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులే చర్చించుకోవడం, చేరడం ఖాయమైందని.. ముహూర్తం కోసం చూస్తున్నారన్న మాటలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన కేసీఆర్‌ను కలవడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టేనని కొందరు భావిస్తుండగా, మరికొందరు నాయకులు మాత్రం పార్టీ మారే అవకాశాలను కొట్టిపారేయలేమని వాదిస్తున్నారు.


ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసి చర్చలు జరిపినప్పుడు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నట్లు సమాచారం. లక్ష్మారెడ్డి వెంట నియోజకవర్గ నాయకులు తరలివెళ్లారు. నాయకులందరూ కేసీఆర్‌తో ఫొటోలు దిగిన అనంతరం అక్కడే భోజనాలు చేశారు. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. వారితో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఐదు గంటల పాటు కేసీఆర్‌ ఫాంహౌ్‌సకు వచ్చిన కార్యకర్తలను కలిశారు.

Updated Date - Jun 27 , 2024 | 04:38 AM