Share News

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:28 PM

ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర
CM Revanth Reddy

హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని ఈ క్షణం తనను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానని ఉద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థులు ఉన్నారని... తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారని వివరించారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నామని చెప్పారు. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్య లాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందని అనుకున్నామని కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని అన్నారు. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


బడ్జెట్‌‌లో 7.3 శాతం కేటాయించాం..

‘‘ తెలంగాణ బడ్జెట్‌లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల పాఠశాలల్లో.. 26లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు..10వేల ప్రైవేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది.. ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.


ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గాయి..

‘‘తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి. గత ఏడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకు పైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


కార్యదీక్షతో పనిచేయాలి..

‘‘అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం. తెలంగాణ బలపడాలి అంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 05:46 PM