Share News

Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:07 AM

Telangana: తిరుమల లడ్డు వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి, జరిగింది ఏంటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు.

Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Former MLA Jagga Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 25: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనపై మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి స్పందించారు. తిరుమల లడ్డు వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి, జరిగింది ఏంటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. ఇక్కడ జరిగిన అంశాలకంటే రాజకీయ లబ్ది, మత పరమైన అంశాల చర్చ ఎక్కువగా జరిగి వాస్తవాలు మరుగున పడిపోతున్నాయని తెలిపారు.

Harsha Sai: హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్.. యువతి పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాడంటే..


మాజీ ఎమ్మెల్యే అనుమానాలు...

రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వెంటనే బయటపెట్టి తిరిగి కల్తీలేని లడ్డులను భక్తులకు అందించి అలాంటి దోషాలు తిరిగి జగరకుండా పకడ్బందీగా చర్యలు తీసుకొని భక్తులకు భరోసా కల్పించాలని సూచించారు. కానీ అలా కాకుండా చంద్రబాబు దీన్ని రాజకీయం చేయడం, మత ప్రస్తావన తేవడం, జగన్ పేరు ప్రస్తావన చేయటంతో వ్యక్తిగతంగా తనకు కొన్ని అనుమానాలు వస్తున్నాయని.. బీజేపీ ఏమైనా చంద్రబాబుతో మతపరమైన రాజకీయాలకు తెరతీస్తుందా అనేది తన అనుమానం అంటూ బయటపెట్టారు. ‘‘ఎందుకంటే బీజేపీ ఎజెండానే ఎప్పుడు ప్రజా సమస్యల చుట్టూ కాకుండా మతపరమైన అంశాల చుట్టూనే ఉంటుంది. ఎమోషనల్‌గా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయడమే బీజేపీ ఎజెండా. పరిస్థితులు చూస్తే ఏపీలో బీజేపీ ఆట మొదలుపెట్టినట్టు అనిపిస్తోంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


అలా చేస్తే ఏ సీఎం పని చేయలేరు..

ఏపీ రాజకీయాల్లో జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించడాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అంతా తప్పుపట్టామని.. ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆయన్ని గౌరవిస్తానన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం చాలా గొప్పది అని కొనియాడారు. జగన్ విజన్‌పై క్లారిటీ లేదు కానీ చంద్రబాబుకు విజనరీ అనే పేరు ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వయస్సును కూడా చూడకుండా కొంతమంది వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదన్నారు. అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన చంద్రబాబును కాపాడుకోవడం, గౌరవించుకోవడం అవసరమని గతంలోనే చెప్పానన్నారు. ముఖ్యమంత్రుల నిర్ణయాల్లో తప్పులు వెతకడం మొదలుపెడితే ఏ సీఎం కూడా పనిచేయలేరన్నారు. ఏదో టెక్నికల్ ఆధారాలు పట్టుకుని చంద్రబాబుని జైలుకు పంపారు అది ఆయన రాజకీయంగా అడ్వాంటేజ్‌గా తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా జగన్ పార్టీ నేతలు రాజకీయాల్లోకి లాగారు వారిపై అనుచిత కామెంట్స్ చేశారన్నారు. అటువంటి కామెంట్స్‌ను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారంతా ఖండించామని చెప్పారు. అధికారం మైకంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయనకే శాపంగా మారాయన్నారు. అదే సమయంలో చంద్రబాబు ప్రజల్లో తిరుగుతూ కష్టపడ్డారని.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

Pawan Kalyan: ఆనాటి మాటలు గుర్తుచేసిన పవన్ కల్యాణ్



ఆ నమ్మకముంది..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్నారు. రాష్ట్రం విభజన చేసిందనే కోపం అక్కడ ప్రజలకు ఉందని.. అందుకే గత మూడు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారని నమ్మకముందన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి దేశ ప్రజలు కచ్చితంగా అవకాశం ఇస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ నేతృత్వంలోనే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీనే పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.


కచ్చితంగా పూర్తి చేస్తాం...

మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తానని ఇవ్వలేకపోయారన్నారు. ఇప్పుడు టీడీపీ బలంతోనే కేంద్రంలో మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. అయినా కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారని తెలిపారు. గతంలో మోదీకి మద్దతు ఇచ్చిన జగన్ కూడా ప్రత్యేక హోదా తేలేకపోయారు అంటే గతంలో జగన్, ప్రస్తుతం చంద్రబాబు ఫెయిలయ్యారని విమర్శించారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తారని వెల్లడించారు.

R Krishnaiah: ఆర్‌ కృష్ణయ్య రాజీనామాలో ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ



మత ప్రస్తావ వద్దు...

వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు మెజారిటీ ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే భక్తులలో సామాన్య ప్రజల్లో రకరకాల ఆందోళనకు కారణం అవుతోందన్నారు. కల్తీ నెయ్యిని లడ్డూల్లో కలపమని ఏ ముఖ్యమంత్రి చెప్పరని.. అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకెవరైనా. వాళ్లు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళైనా అటువంటి కల్తీ నెయ్యి లడ్డూలో కలపమని చెప్పరన్నారు. ఏపీ రాజకీయాల్లో దయచేసి మత ప్రస్తావన తీసుకురావద్దన్నారు.


అదే బీజేపీ పెద్దల ఆలోచన..

గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏం చేసిందో చూశామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పాతబస్తీపైన రకరకాల ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందిందన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఇలాంటి ఎమోషనల్ ఎజెండాను తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయనే అనుమానం బలపడుతోందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎక్కువ లోక్‌సభ సీట్లు రావద్దనేది బీజేపీ సెంట్రల్ పార్టీ ఆలోచన అని తెలిపారు.

Harish Rao: ఇంత దిగజారుడుతనమా.. ఇంత దౌర్జన్యమా..



బీజేపీ డైరెక్షన్లోనే...

లడ్డు వివాదం వెనుక బీజేపీ ఉందా అనే డౌట్ పెరుగుతోందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనిది చంద్రబాబు క్రిస్టియన్ అనే ప్రస్తావనను ఎందుకు పదే పదే తెస్తున్నారని ప్రశ్నించారు. జగన్ క్రిస్టియన్ అనేది జగమెరిగిన సత్యమన్నారు. లడ్డు విషయంలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు బీజేపీ డైరెక్షన్లోనే అనేది తన అనుమానమన్నారు. లడ్డు వివాదంలో జగన్‌ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. మత విశ్వాసాలు రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలనేది బీజేపీ ప్లాన్‌గా కనబడుతోందన్నారు.


బీజేపీ కుట్ర కనబడుతోంది..

టీడీపీ, వైసీపీ కొట్లాటలో తమ ఎంపీ స్థానాలు పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ అని.. అందుకే బీజేవైఎం కార్యకర్తలు జగన్ ఇంటిపై దాడి చేశారన్నారు. ఒక్కరోజులోనే తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగిందో తేల్చి దోషులను శిక్షించే అవకాశం ఉండగా దాన్ని రోజుల తరబడి విభాగంగా మార్చి ఏపీ రాజకీయాలలో లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నం చేయడం వెనక బీజేపీ కుట్ర కనబడుతోందన్నారు. ఏపీ సీఎం కూడా తన విజన్‌ను పక్కనపెట్టి పూర్తిగా రాజకీయం చేస్తున్నట్లుగానే అనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు లేని కొత్త అలవాటును బీజేపీ ఆయనకు అలవాటు చేస్తున్నట్లు కనపడుతోందని విమర్శించారు. ఈ పరిణామాలు చూసినప్పుడు ఈ మొత్తం వివాదం వెనుక బీజేపీ ఉంది అనే విషయం చాలా స్పష్టంగా కనబడుతోందన్నారు. ఏపీకి సంబంధించిన రాజకీయ పార్టీలు లడ్డు వివాదాన్ని రాజకీయం చేయకుండా ఈ ఘటనలో దోషులెవరో విచారణ చేసి వారిని శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

Kodandaram: దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

Harish Rao: ఇంత దిగజారుడుతనమా.. ఇంత దౌర్జన్యమా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 11:07 AM