IG V. Satyanarayana: ‘పట్నం’ బెయిల్ రద్దు చేయాలని కోరతాం
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:19 AM
లగచర్ల దాడి కేసులో నిందితుడైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోర్టును కోరతామని మల్టీ జోన్ ఐజీ వీ సత్యనారాయణ తెలిపారు.

బెయిల్పై ఉండి ప్రెస్ మీట్ ఎలా పెడతారు?
పాస్వర్డ్ చెప్పలేదు.. విచారణకు సహకరించట్లేదు
లగచర్ల దాడి కేసులో అన్ని ఆధారాలూ ఉన్నాయి
మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ
పరిగి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): లగచర్ల దాడి కేసులో నిందితుడైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోర్టును కోరతామని మల్టీ జోన్ ఐజీ వీ సత్యనారాయణ తెలిపారు. నరేందర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వం, పోలీసులపై అసత్య ఆరోపణలు చేశారని ఐజీ పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలిపారు. ఆయన మాటల తీరు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ రద్దు కోసం కోర్టును కోరతామని తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతారని ఐజీ ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టి ఇరికించారని చెప్పడం తప్పని, కలెక్టర్పై దాడి చేసిన వారిని మాత్రమే అరెస్ట్ చేశామని చెప్పారు. విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామని తెలిపారు. నిఽఘా వైఫల్యం అసలు కానేకాదని, అన్ని జాగ్రత్తలు తీసుకుని పోలీసు బందోబస్తుతోనే లగచర్ల వెళ్లామని తెలిపారు.
దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఎవరినీ పోలీసులు కొట్టలేదని చెప్పారు. నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్వర్డ్ చెప్పడం లేదన్నారు. మరో నిందితుడు సురేశ్ తన సిమ్ కార్డు విరిచి ఏదో వాహనంలో పడేశానని చెబుతున్నాడని తెలిపారు. ఇద్దరూ పోలీసుల విచారణకు సహకరించడం లేదని చెప్పారు. సురే్షకు సంబంధించిన కొన్ని ఆడియోలు తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతామని తెలిపారు. దాడికి ముందు రోజు నరేందర్రెడ్డి, సురేష్ పథకం పన్నారని, సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టిని మరల్చి గ్రామంలోకి తీసుకెళ్లాడని చెప్పారు. సురేష్ మాటలు నమ్మి కలెక్టర్ గ్రామంలోకి వెళ్లారని తెలిపారు. పథకం ప్రకారం సురేశ్, అనుచరులు కలిసి రాళ్ళు, కర్రలతో కలెక్టర్, అధికారులపై దాడి చేశారని పోలీసుల విచారణలో తేలిందని పేర్కొన్నారు. దాడికి వారం ముందే నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని రెచ్చగొట్టారని కూడా పోలీసుల విచారణలో తేలిందన్నారు. దాడికి ముందు రోజు మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, కుట్రలో ఎవరెవరు ఉన్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్టోబరు 25న రోటిబండాతండాలో జరిగిన దాడి కన్నా మూడు రెట్లు ఎక్కువగా దాడులు చేస్తామని చెప్పిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. నిందితుడికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనలో జైలు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
బీసీ కులగణనపై బీజేపీ వైఖరేంటి? : కవిత
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీల కులగణనపై తమ వైఖరేంటో బీజేపీ స్పష్టం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హమీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై బీజేపీ ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. గురువారం కవితను కుమ్మరి సంఘం నేతలు కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారు కులవృత్తులను కుదేలు చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరిస్తున్నా బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రప్రభుత్వం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నేతలు శివశంకర్, నరేశ్, శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.