Share News

Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:16 PM

బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!

హైదరాబాద్, జూన్ 24: బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్‌కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ రాకపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ రాకపై తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా తీసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ క్రమంలో పార్టీలోని కీలక నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడినట్లు తెలుస్తుంది.


ఆ క్రమంలో సోమవారం జగిత్యాలలో తన ముఖ్య అనుచరులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో.. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని టి. జీవన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. అందులోభాగంగా తన రాజకీయ భవిష్యత్తుపై వారితో జీవన్ రెడ్డి చర్చిస్తున్నారు.

మరోవైపు జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ రంగంలోకి దిగింది. అందులోభాగంగా ఆ పార్టీ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు పలువురు కీలక నేతలు.. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకో వద్దని ఆయన్ని వారంత కోరినట్లు తెలుస్తుంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు గౌరవప్రదంగా రాజకీయం చేశానని వారికి జీవన్‌రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని వారితో జీవన్‌రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఇంకోవైపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సైతం జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నారు. అందులోభాగంగా ఆయన సైతం.. జీవన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు జగిత్యాలకు బయలుదేరి వెళ్లారు.


గతేడాది చివరల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ భాగంగా బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతలంతా ఆ పార్టీ గుటికి చేరిపోయారు. ఆ క్రమంలో తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే జగిత్యాల నుంచి టి. జీవన్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగాను పని చేశారు. ఇక తన సొంత నియోజకవర్గంలోని వారు.. తన పార్టీలో చేరుతుంటే ఆ విషయాన్ని కూడా తనకు పార్టీ నేతలు చెప్పక పోవడంపై జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 04:33 PM