కొలిక్కిరాని చర్చలు..గడువు కోరిన ఓఎన్జీసీ అధికారులు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:57 AM
ఓడలరేవు గ్రామ దత్తత, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తదితర డిమాండ్లపై ఓడలరేవు గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన చర్చలు కొలిక్కిరాక వాయిదా పడ్డాయి.

అల్లవరం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఓడలరేవు గ్రామ దత్తత, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తదితర డిమాండ్లపై ఓడలరేవు గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన చర్చలు కొలిక్కిరాక వాయిదా పడ్డాయి. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో మాధవి, డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబురాజు, సీఐ డి.ప్రశాంత్కుమార్, ఓఎన్జీసీ ఈడీ గుప్తా, అధికారులు హెచ్ఆర్ సునీల్కుమార్, రామకృష్ణ, ప్రోమోటెక్ ప్రతినిధి సందీప్, గ్రామస్తుల సమక్షంలో చర్చలు ఎటూ తేలక మరోసారి వాయిదా పడ్డాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ గ్రామస్తులు చెప్పారు. ఓడలరేవు గ్రామాభివృద్ధి, స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు వారం రోజులు గడువు ఇవ్వాలంటూ ఓఎన్జీసీ అధికారులు గుప్తా తదితరులు కోరడంతో చర్చలు వాయిదా పడ్డాయి. గ్రామస్తులు కొల్లు విష్ణుమూర్తి, నాతి లెనిన్బాబు తదితరులతో పాటు 30 మంది చర్చల్లో పాల్గొన్నారు. అల్లవరం ఎస్ఐ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.