Resignation: గుంటూరు మేయర్ రాజీనామా
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:15 AM
గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్నాయుడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్కు..

కూటమి ప్రభుత్వ అవమానాలు భరించలేకే!
వైసీపీలోనే కొనసాగుతా: మనోహర్ నాయుడు
గుంటూరు కార్పొరేషన్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్నాయుడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్కు పంపుతున్నట్టు శనివారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, కూటమి నాయకుల అవమానాలు భరించలేకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన కారు డ్రైవర్ను, సిబ్బందిని కూడా పూర్తిగా తొలగించారన్నారు.
తనకు తెలియకుండానే స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం, అధికారులు, కూటమి నాయకులు కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, గుంటూరు చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు లేదని చెప్పారు. నాలుగేళ్లపాటు మేయర్గా పనిచేశానని, తనకు సహకరించిన కార్పొరేటర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.