మిర్చి ధర భారీగా పతనం
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:55 PM
మిర్చి ధర భారీగా పతనం

క్వింటం గరిష్ఠం రూ.10,206
ఆదోని అగ్రికల్చర్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎండుమిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి. బుధవారం ఎండుమిర్చి ధర క్వింటం గరిష్ఠంగా రూ.10,206 పలికింది. గత వారంతో పోల్చితే ఎండుమిర్చి ధర క్వింటానికి రూ.3వేలకు పైగా ధర పతనమైంది. కర్ణాటక రాష్ట్ర బ్యాడిగి మార్కెట్, గుంటూరు మిర్చి మార్కెట్లోను ధరలు భారీగా పతనమైనట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు దిగుబడులు భారీగా రావడం ఎగుమతులు లేకపోవడమే ధరలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. మిర్చి సాగు చేసిన రైతులు ఎకరాలకు రూ.లక్షన్నరకు పైగా సాగు పెట్టుబడి ఖర్చులు పెట్టామని, పెరిగిన ఎరువులు, విత్తనాలు, మిర్చి కోత కూలీలు తడిసి మోపెడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ధర వల్ల తమకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక అప్పుల పాలవుతున్నామని వాపోయారు. 2057 బస్తాల ఎండుమిర్చిని రైతులు విక్రయానికి రాగా క్వింటం కనిష్ఠ ధర రూ.2009, గరిష్ఠ ధర రూ.101206, మధ్య ధర రూ.8300 పలికింది.