దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:43 AM
దళారుల మాటలు నమ్మి ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య రైతులకు సూచించారు.

కొత్తపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): దళారుల మాటలు నమ్మి ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య రైతులకు సూచించారు. బుధవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఎంపీడీవో మేరీ పర్యవేక్షణలో మార్క్ఫెడ్ డీఎం హరినాథ రెడ్డి, ఏడీఏ ఆంజనేయ, మార్క్ఫెడ్ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్వింటం కందులు రూ.7,550, శనగ రూ.5,650, మినుములు 7,400 చొప్పున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని ఆయా గ్రామాల రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఏవో మహేష్, గోపాల్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీదేవి, పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి
పార్టీలకతీతంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే జయసూర్య చెప్పారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీడీవో మేరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తహసీల్దార్ ఉమారాణి, జడ్పీటీసీ సోముల సుధాకర్ రెడ్డి, మండల సర్వేయర్ అనూష, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.