తాగునీటి గండం
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:34 AM
వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పవేమోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణానికి తాగునీటి సరఫరా చేసే బసాపురం ఎస్ఎస్ ట్యాంకులో నీటి నిల్వ పూర్తి స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం.

ఆదోనిలో మూడురోజుల కోసారి తాగునీరు
ఎస్ఎస్ ట్యాంకు గట్లకు పగుళ్లు
కొంతవరకే నింపిన అధికారులు
ఆదోని టౌన్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పవేమోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణానికి తాగునీటి సరఫరా చేసే బసాపురం ఎస్ఎస్ ట్యాంకులో నీటి నిల్వ పూర్తి స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం.
శివారు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు
పట్టణ శివారు ప్రాంతాల్లో అప్పుడే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. వైఎస్సార్ నగర్, భీమ్ రెడ్డి కాలనీ, లక్ష్మమ్మ నగర్, కోట్ల కాలనీ, మోనార్టీ కాలనీ, రాయనగర్ తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీకి ఒక ట్యాంకర్ మాత్రమే ఉండటంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఆధిగమిం చడానికి అధికారులు రు.1.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త బోర్లు వేయడానికి, పాత వాటికి మరమ్మతులు, ప్లషింగ్ చేయడానికి, లీకేజీల మరమ్మ తులు, ట్యాంకర్లతో శివారు ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ప్రాంతాలవారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు.
రాంజలకు నీటి పంపింగ్
బసాపురం ఎస్ఎస్ ట్యాంకుతో పాటు, పురాతన రాంజల చెరువును కూడా నింపేందుకు ఎల్ఎల్సీ నుంచి మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తున్నారు. 3,110 మిలియన్ లీర్ల సామర్థ్యం ఉన్న బసాపురం చెరువులో 1,800 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. అలాగే 1,210 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రాంజల చెరువులో 800 నీరు మాత్రమే నిలువ ఉంది. ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే కెనాల్లో నీరు వచ్చే అవకాశం ఉంది.
తాగునీటి ఇబ్బందులు రానివ్వం
ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం మూడు రోజులకోసారి తాగు నీటిని సరఫరా చేస్తున్నాం. రాంజల చెరువును కూడా నీటితో నింతున్నాం. ఇప్పు డున్న నీటితో పట్టణ ప్రజలకు 90 రోజుల వరకు తాగునీటిని అందించే అవకాశం ఉంది. - కృష్ణ, మునిసిపల్ కమిషనర్