Lanka Dinakar: ఉపాధి నిధులు మురగబెట్టేశారు
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:58 AM
నిధులను మురగబెట్టేశారని, ఖర్చు చేసిన వాటిలో భారీ అవినీతి జరిగిందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు.

వైసీపీ పాలనలో భారీగా అవినీతి: లంకా దినకర్
విశాఖపట్నం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ఉపాధి హామీ పథకం నిధులను మురగబెట్టేశారని, ఖర్చు చేసిన వాటిలో భారీ అవినీతి జరిగిందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ 15 జిల్లాల్లో పర్యటించి, అధికారులతో సమీక్షించాకే తాను ఈ విషయం చెబుతున్నానన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 2019-24 మధ్య కాలంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన మెటీరియల్ కంపోనెంట్ ఎంటైటిల్మెంట్ వినియోగించుకోకపోవడం వల్ల నిధులు మురిగిపోయాయన్నారు. ఇక రాష్ట్రం మొత్తం లెక్క వేసుకుంటే ఎంత ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ పథకంలో సిమెంట్ను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరుతో సరఫరా చేశారని, నాటి అధికార పార్టీ పెద్దలకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, అక్కడి నుంచే సరఫరా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ విశాఖ అధ్యక్షులు పరశురామరాజు, పూర్వ అధ్యక్షులు ఎం.రవీంద్ర, అధికార ప్రతినిధి సుహాసినీ తదితరులు పాల్గొన్నారు.