పాము కాటుకు గురైన వృద్ధుడి మృతి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:54 PM
పాముకాటుకు గురై ఒంగోలులోని రిమ్స్లో చికిత్స పొందుతున్న మండలంలోని మూగచింతలకు చెందిన పోకూరి పేరయ్య (75) సోమవారం మృతి చెందాడు.

కొండపి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పాముకాటుకు గురై ఒంగోలులోని రిమ్స్లో చికిత్స పొందుతున్న మండలంలోని మూగచింతలకు చెందిన పోకూరి పేరయ్య (75) సోమవారం మృతి చెందాడు. ఈనెల 17వతేదీ పేరయ్య గ్రామానికి సమీపంలో తాటి ఆకులు కోసి చొక్కా తొడుక్కుంటుండగా కాలుపై పాము కాటేసింది. గమనించిన పేరయ్య తన పక్కన ఉన్న వారికి చెప్పడంతో ఒంగోలులోని రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు రిమ్స్ నుంచి పోలీసులకు సమాచారం అందింది.
500కు పైగా పాములను పట్టి..
మూగచింతల గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు పేరయ్య ఏరకం పామునైనా ఇట్టే పట్టగల నేర్పరి. గ్రామంలోని ఇళ్లు, పొలాల్లో పాములు కనిపిస్తే గ్రామస్థులు వెంటనే పేరయ్యకు సమాచారం ఇస్తారు. ఆయన ధైర్యంగా పామును పట్టుకొని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టేవాడు. ఇలా సుమారు 500కుపైగా సర్పాలను పట్టుకున్న పేరయ్య పాముకాటుతోనే మృతి చెందడం విషాదకరం.