గనులశాఖను భ్రష్టుపట్టించారు
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:39 AM
ఇసుక, ఇతర ఖనిజాల దోపిడీతో గనుల శాఖను వైసీపీ పాలకులు గత ఐదేళ్లలో పూర్తిగా భ్రష్టుపట్టించారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శుక్రవారం మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రం ఎస్ఈజెడ్లోని గ్రానైట్ ఫ్యాక్టరీలను ఆయన పరిశీలించారు.

ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
గుండ్లాపల్లి ఎస్ఈజెడ్లోని ఫ్యాక్టరీల సందర్శన
మద్దిపాడు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : ఇసుక, ఇతర ఖనిజాల దోపిడీతో గనుల శాఖను వైసీపీ పాలకులు గత ఐదేళ్లలో పూర్తిగా భ్రష్టుపట్టించారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శుక్రవారం మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రం ఎస్ఈజెడ్లోని గ్రానైట్ ఫ్యాక్టరీలను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైనింగ్, ఎక్సైజ్ శాఖలో త్వరలో మెరుగైన విధానాలు తీసుకొస్తా మన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనిం గ్లో ఇష్టారీతిన దోచుకున్నారని, వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి జమచేయకుండా సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని విమర్శించారు. న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసే వారిని రాష్ట్రం నుంచి తరిమేశారని ధ్వజమెత్తారు. గత ముఖ్యమంత్రి కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని గనుల శాఖను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇసుక విధానం అమలు చేసినప్పుడు రీచ్లో స్టాక్ పాయింట్ల పర్యవేక్షణ ఉండేదన్నారు. ఇసుక కొరత లేకుండా చర్యలు చేపడతామని రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లాలో 1,500కిపైగా మైనింగ్ సంస్థలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వంలో వ్యాపారులపై వేధింపులు ఉండవన్నారు. మైనింగ్ కంపెనీలపై వేల కోట్లు పెనాల్టీలు వేసి కంపెనీలను హస్తగతం చేసుకునేందుకు వైఎస్ జగన్ కుట్రలు చేశారన్నారు. త్వరలోనే నూతన పాలసీతో మైనింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. గతంలో తప్పుడు కేసులతో మూతబడిన అన్ని కంపెనీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నూతన విధానంతో రాష్ట్ర ఆదాయం పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్కుమార్ మాట్లాడుతూ గతంలో జరిగిన అక్రమాలను బయటకు తీసి బాఽధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్ర అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని అన్నారు. తొలుత మంత్రికి పార్టీ మండల అధ్యక్షుడు మండవ జయంత్ బాబు, ఆళ్ల రవి, మండవ రత్నాకర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.