Share News

ఉన్నతాధికారి వచ్చినా అదేతీరు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:23 AM

జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కి వచ్చే రోగులకు అవస్థలు త ప్పడం లేదు.

ఉన్నతాధికారి వచ్చినా అదేతీరు
ఎమర్జెన్సీ వార్డు వద్ద గల ఎక్స్‌రే గది వద్ద వేచి ఉన్న రోగులు

  • రిమ్స్‌లో మొరాయించిన ఎక్స్‌రే మెషిన్‌

  • ప్రసూతివార్డు వద్ద పనిచేయని లిఫ్ట్‌

  • డీఎంఈ సందర్శించినా షరామామూలే..

అరసవల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కి వచ్చే రోగులకు అవస్థలు త ప్పడం లేదు. అయితే ఉన్నతాధికారులు సందర్శించిన సమ యంలోనూ అదేతీరు కొనసాగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ రఘునందన్‌ శుక్రవారం రి మ్స్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను, వార్డులను ఆయన పరిశీలించారు. మెడికల్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఎటు వంటి సమస్యలు కనబడకుండా ముందు జాగ్రత్తలు తీసు కుంటారు. కానీ శుక్రవారం మాత్రం రిమ్స్‌ ఆసుపత్రిలో ఎక్స్‌రే మెషిన్‌ పనిచేయడంలో ఇబ్బందులు తలెత్తి అది మొరాయించింది. దాంతో ఎమర్జెన్సీ వార్డులో గల ఎక్స్‌రే ప్లాంట్‌ వద్ద రోగులు ఎక్స్‌రేల కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అలాగే ప్రసూతి వార్డు వద్ద గల లిఫ్ట్‌ గతకొద్ది రోజులుగా పనిచేయడం లేదు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు.. ప్రసవం అనంతరం ఒకటో అంతస్తులో గల వార్డుకు తరలిస్తారు. కానీ ఇక్కడ లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడుతున్నారు. డీఎంఈ వచ్చిన ఇక్కడి పరిస్థితి మారడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీలావుంటే డీఎంఈ వస్తుండడంతో శుక్రవారం ఉదయం నుండే రిమ్స్‌ ఓపీ కౌంటర్ల వద్ద గల టీవీలు ఆకస్మాత్తుగా పనిచేయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 22 , 2025 | 12:23 AM