Road Accident : లే నాన్నా లే!
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:10 AM
లే నాన్నా లే.. ఇంటికెళ్లి పోదాం.. అంటూ ఓ తల్లి కుమారుడిని పట్టుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిచింది.

స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
వెనుక చక్రాల కింద నలిగి చిన్నారి మృతి
గోకవరం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): లే నాన్నా లే.. ఇంటికెళ్లి పోదాం.. అంటూ ఓ తల్లి కుమారుడిని పట్టుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిచింది. తన ఒక్కగానొక్క కుమారుడు స్కూలు నుంచి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లి.. కుమారుడు విగతజీవిగా రోడ్డుపై పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒక చిన్నారి బలైపోయిన సంఘటన శనివారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో జరిగింది. కోరుకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వెదురపాక గ్రామానికి చెందిన కుంచే రాంబాబు కుమారుడు జితేంద్ర(5) ఎల్కేజీ చదువుతున్నాడు. ఉదయం బస్సులో పాఠశాలకు వెళ్లి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చాడు. బస్ దిగి కూతవేటు దూరంలో ఉన్న ఇంటికి వెళుతుండగా డ్రైవర్ బాలుడిని గమనించకుండా బస్ను వేగంగా పోనిచ్చాడు. దీంతో చిన్నారి ఆ స్కూల్ బస్ వెనుక చక్రం కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు వస్తాడని చూస్తున్న తల్లి ఎంతకీ రాకపోవడంతో బయటకు వెళ్లి చూసింది. తన కుమారుడు చక్రాల కిందపడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. లేనాన్నా లే అంటూ రోడ్డుపై కూర్చుని గుండెలవిసేలా రోదించింది. రాంబాబుకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నాడు. దంపతులిద్దరూ కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని బోరున విలపిస్తున్న తీరు చూపరులందరినీ కలిచివేసింది.