ఇద్దరు మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాటు
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:43 PM
జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే ఉద్దేశంతో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయారని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు.

పాడేరురూరల్, మార్చి 23: జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే ఉద్దేశంతో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయారని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చర్ల-శబరి ఏరియా బీకే-ఏఎస్ఆర్ డివిజన్ ఏరియా కమిటీ సభ్యుడు, శబరి ఎల్వోఎస్ కమాండర్ అయిన రవ్వ కొస(22) అలియాస్ జగదీశ్ స్వగ్రామం అల్లూరి జిల్లాలోని ఎటపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గరం అని తెలిపారు. అలాగే పామేడ్ ఏరియా కమిటీ సీఎన్ఎం కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు పొడియం రమేష్(26) ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడతమాల గ్రామానికి చెందిన వాడన్నారు. వీరిద్దరూ పలు సంఘటనల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టులకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, దళంలో వివక్ష కారణంగా పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. జనజీవనంలో కలవాలనుకొనే మావోయిస్టులు నేరుగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రతించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్)జగదీశ్ అడహల్లీ, రంపచోడవరం అడిషనల్ సూపరింటెండెంట్ కె.ధీరజ్ పాల్గొన్నారు.