ఆక్వా రైతుల ఆగ్రహం..
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:49 AM
ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.రొయ్య పిల్లలు విక్రయించే హేచరీల నుంచి, మేత కంపెనీలు, కొనుగోలుదారుల వరకూ అందరూ సిండికేట్ అయి ముంచే స్తున్నారు’ అని పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం చైర్మెన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు,పలువురు రైతులు తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

మూడు నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడేకు తీర్మానం
ఆక్వా రైతు సంఘం చైర్మన్ గాంధీ భగవాన్రాజు
పాలకొల్లు రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి):‘ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.రొయ్య పిల్లలు విక్రయించే హేచరీల నుంచి, మేత కంపెనీలు, కొనుగోలుదారుల వరకూ అందరూ సిండికేట్ అయి ముంచే స్తున్నారు’ అని పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం చైర్మెన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు,పలువురు రైతులు తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో సోమ వారం ఆక్వా రైతుల మహాసభ ధర్నాలో వీరు మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 26 శాతం సుంకాన్ని అస్త్రంగా తీసుకొని కొనుగోలు కేంద్రాలు రైతుల నుంచి రొయ్యలను అడ్డగోలుగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో 50 నుంచి 40 కౌంటు రొయ్యలకు మాత్రమే సుంకం విధిస్తే ఇక్కడ వేరే దేశాలకు వెళ్లే 100 కౌంటుకు ధర విపరీతంగా తగ్గించి కొంటున్నారని మండిపడ్డారు.మహా సభలో ‘పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజక వర్గాల్లో జూలై నుంచి సెప్టెంబరు వరకు క్రాప్ హాలిడేను పాటించాలని, కిలోకు రూ.250 గిట్టుబాటు ధర కల్పించేందుకు,ఆక్వా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కార్యచరణ చేపట్టాలి’ అని తీర్మానించారు. అనంతరం రైతులు పూలపల్లి వైజంక్షన్ సెంటర్ రోడ్డుపై భైఠాయించారు. పెన్మెత్స సత్యనారాయణరాజు, బోనం చినబాబు, కార్యదర్శి మేడిది జాన్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు,గుంటూరి పెద్దిరాజు, కర్నేన గౌరు నాయుడు, అంగర వరప్రసాదు, మేకా ఫణీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.