ఓలా ఎలక్ట్రిక్కు మరో షాక్
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:57 AM
ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన విక్రయ గణాంకాలు, వాస్తవ రిజిస్ట్రేషన్లలో భారీ వ్యత్యాసంతో పాటు కంపెనీపై పెరుగుతున్న...

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన విక్రయ గణాంకాలు, వాస్తవ రిజిస్ట్రేషన్లలో భారీ వ్యత్యాసంతో పాటు కంపెనీపై పెరుగుతున్న ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి, 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ)ను కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోరినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు వాహన్ పోర్టల్లో కేవలం 8,652 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా.. కంపెనీ మాత్రం ఆ నెలలో 25,000కు పైగా వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ఈ నెలలోనూ 20వ తేదీవరకు కంపెనీ రిజిస్ట్రేషన్లు 11,781 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రకటించిన ఫేమ్ రెండో విడత పథకంతో పాటు పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ లబ్దిదారుల్లో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి. భారీ పరిశ్రమల శాఖ పర్యవేక్షణ పరిధిలోని సర్టిఫికేషన్, టెస్టింగ్ ఏజెన్సీ అయిన ఏఆర్ఏఐనే ఓలా ఎలక్ట్రిక్కు ఈ పథకాలకు సంబంధించిన అర్హత పత్రం జారీ చేసింది.
అందుకే కంపెనీపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఏఆర్ఏఐని నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాహనాల్లో తయారీ లోపాలు, వాహన సర్వీసింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఏజెన్సీ సీసీపీఏ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్పై దర్యాప్తునకు ఆదేశించింది.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For Business News And Telugu News