Writers Association : కెవిఆర్ లేఖలు ఆవిష్కరణ
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:25 AM
కెవిఆర్గా ప్రసిద్ధుడైన కె.వి.రమణారెడ్డి తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి. కావలి జవహర్ భారతిలో అధ్యాపకులుగా పనిచేస్తూనే రచనా వ్యాసాంగాన్ని కొనసాగించినవారు.

కెవిఆర్గా ప్రసిద్ధుడైన కె.వి.రమణారెడ్డి తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి. కావలి జవహర్ భారతిలో అధ్యాపకులుగా పనిచేస్తూనే రచనా వ్యాసాంగాన్ని కొనసాగించినవారు. సాహిత్య రచనలో భిన్నప్రక్రియలలో కెవిఆర్ కృషి ఉంది. జీవితాంతం ప్రగతిశీల ఉద్యమాలలో భాగమైనవాడు. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శి. ఎరుపు, అరుణతారకు సంపాదక బాధ్యతలు నిర్వహించాడు. 1975 జూన్లో అత్యవసర స్థితిలో 21 నెలలు జైలు జీవితాన్ని అనుభవించారు. తెలుగు సమాజపు సృజనాత్మక ఆవరణకు కెవిఆర్ సాక్షి. గురజాడ సాహిత్య కల్పనను మహోదయం పేరిట పరిచయం చేశారు. రవీంద్రుని కథలను తెలుగు చేసారు. చివరిశ్వాస వరకు విప్లవ రచయితల సంఘం బాధ్యతలలో ఉన్నారు. 1998 జనవరిలో కెవిఆర్, 2009లో ఆయన సహచరి శారదాంబ మరణించారు.
కుటుంబ సభ్యులు కెవిఆర్–శారదాంబ కమిటీని ఏర్పాటు చేసి పుస్తకాలను ప్రచురించి, ప్రతి ఏటా కెవిఆర్ పుట్టిన తేదీ మార్చి 23న స్మారక ప్రసంగాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ సమావేశమందిరం (చల్లపల్లి బంగళా)లో ఉదయం 10గం.లకు కెవిఆర్ లేఖలు ఆవిష్కరణ జరుగుతుంది. ‘సంస్కృతి, భావజాలం, కెవిఆర్ దృక్పధం’ అనే అంశంపై ప్రొఫెసర్ కాశీం, ‘జీఎన్.సాయిబాబ అమరత్వం’పై వసంత ప్రసంగాలు ఉంటాయి. – అరసవిల్లి కృష్ణ కెవిఆర్
–శారదాంబ స్మారక కమిటి