Narayan Rane: ఆదిత్య పేరు చెప్పొద్దని ఉద్ధవ్ ఫోన్ చేశారు
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:58 AM
అంతుచిక్కని కారణాలతో 2020 జూన్ 8న దిఽశ అపార్టుమెంటు పై నుంచి దూకి మృతి చెందగా, అది జరిగిన ఆరు రోజులకే జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. దిశ మరణంపై శనివారం బీజేపీ సీనియర్ నేత నారాయణ రాణె తీవ్రమైన ఆరోపణ చేశారు.

సుశాంత్ మేనేజర్ దిశ మృతి ఘటనపై బీజేపీ నేత రాణె
ముంబయి/ న్యూఢిల్లీ, మార్చి 22: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ల మరణాల సంఘటనల్లో తాజాగా మరో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతుచిక్కని కారణాలతో 2020 జూన్ 8న దిఽశ అపార్టుమెంటు పై నుంచి దూకి మృతి చెందగా, అది జరిగిన ఆరు రోజులకే జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. దిశ మరణంపై శనివారం బీజేపీ సీనియర్ నేత నారాయణ రాణె తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆ కేసులో తన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరును మీడియా వద్ద వెల్లడించవద్దంటూ మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనకు ఫోన్ చేసి చెప్పారని ఆరోపించారు. నాడు జరిగిన ఫోన్ సంభాషణను ఆయన వివరించారు. తాను ఎవరి పేరునూ మీడియాకు చెప్పలేదని, ఒక మంత్రి ప్రమేయం ఉందని మాత్రమే అన్నానంటూ ఉద్ధవ్కు సమాధానం ఇచ్చానని రాణె తెలిపారు. ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే మంత్రిగా పనిచేస్తుండడం గమనార్హం. మరోవైపు తన కుమార్తె మరణంపై మరోసారి దర్యాప్తు చేయించాలని, ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలని దిశ తండ్రి సతీష్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసి, హత్య చేశారని ఆరోపించారు.