JAC Meet Delimitation: డీలిమిటేషన్పై హైదరాబాద్లో జేఏసీ తదుపరి భేటీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 02:56 PM
చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: నియోజక వర్గాల పునర్విభజనపై (Delimitation) తమ వాణిని బలంగా వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణకు దిగాయి. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు తొలి జేఏసీ (JAC) సమావేశం జరిగింది. దీనికి కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్లో ఉంటుందని స్టాలిన్ ప్రకటించారు. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Stalin JAC meeting Delimitation: డీలిమిటేషన్పై జేఏసీ భేటీ.. పోరాటం ఆగదని స్టాలిన్ స్పష్టీకరణ
కాగా, టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని, డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణకు తన మద్దతు ఉంటుందని ఒక లేఖ రాశారు. ఆ లేఖను జేఏసీ సమావేశంలో చదివి వినిపించారు. బీజేడీ, సీపీఐ, ఐయూఎంఎల్, మరికొన్ని ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తమ ప్రతినిధులను ఎవ్వరినీ పంపలేదు.
డీలిమిటేషన్కు వ్యతిరేకం కాదు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జేఏసీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రాతినిధ్యాన్ని పటిష్టం చేసే ఎలాంటి చర్యలను తాము వ్యతిరేకించడం లేదని, అయితే నిష్పాక్షిక రాజకీయ ప్రాతినిధ్యం దిశగా చర్యలు ఉండాలని అన్నారు. డీలిమిటేషన్కు తాము వ్యతిరేకం కాదని, నిష్పాక్షికంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని అన్నారు. ప్రాతినిధ్యం తగ్గితే రాష్ట్రాలకు నిధుల విషయంలో పోరాటాలకు దారితీస్తుందని అన్నారు. తీసుకునే నిర్ణయాలు తమ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయని, తమ విద్యార్థులు కీలకమైన అవకాశాలు కోల్పోతారని అన్నారు. రైతులకు ఎలాంటి మద్దతు ఉండబోదన్నారు. మన సంస్కృతి, వృద్ధి ప్రమాదంలో పడతాయని ఆందోళ వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం దెబ్బతింటుందన్నారు. డీలిమిటేషన్తో ప్రాతినిధ్యం తగ్గితే సొంత దేశంలోనే పొలిటికల్ పవర్ను మనం కోల్పోతామని చెప్పారు. ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగరాదని, దీనిని తాము బలంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రాతినిధ్యం తగ్గితే పార్లమెంటులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలను కూడా కోల్పోతామన్నారు.
ఎవరేమన్నారు?
కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ, ఎలాంటి సంప్రదింపులు లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఆలోచనగా ఉందనే వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇందులో స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో పెద్ద సంఖ్యలో సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతాయని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది బీజేపీకి బాగా కొలిసొస్తుందని అన్నారు. జనాభా ప్రాతిపదికగా డీలిమిటేషన్ జరిపితే కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ చాలా కీలకమైనందున ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసేందుకు అన్ని పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్చలు జరపాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సూచించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..