Indian Immigrants2009 నుంచి 2024 వరకు 15,564 మందిని పంపేశారు2009 నుంచి 2024 వరకు 15,564 మందిని పంపేశారు
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:39 AM
వీరంతా ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్నారని, త్వరలో వారిని తిరిగి పంపించివేస్తామని అమెరికా అధికారులు తెలిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభకు తెలిపింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 388మంది భారత జాతీయులను వెనక్కి పంపారని వివరించింది.

భారతీయ అక్రమ వలసదారుల లెక్క ఇది
ట్రంప్కు ముందునుంచే ‘డిపోర్టేషన్’
త్వరలో మరో 295మంది భారత్కు
రాజ్యసభలో విదేశాంగ శాఖ ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 21 : అమెరికా ప్రభుత్వం మరో 295 మంది భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపించనుంది. వీరంతా ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్నారని, త్వరలో వారిని తిరిగి పంపించివేస్తామని అమెరికా అధికారులు తెలిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభకు తెలిపింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 388మంది భారత జాతీయులను వెనక్కి పంపారని వివరించింది. సీపీఐ సభ్యుడు జాన్ బ్రిటస్ దీనిపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ ఇలా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపించివేయడం అనే ప్రక్రియ ట్రంప్కు ముందే మొదలైందని, 2009-2024 మధ్యకాలంలో 15,564మందిని వెనక్కి పంపారని తెలిపింది. ‘‘ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో 6వేలమంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించి పంపివేశారు. బైడెన్ ప్రభుత్వం అదే తరహాలో 3,652 మంది భారతీయ అక్రమ వలసదారులను తిరిగి పంపించారు’’ అని విదేశాంగ శాఖ వివరించింది.
సంకెళ్లపై సభ్యుల నిరసనలు..
భారతీయ అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి తరలించిన అంశంపై విపక్షాలు నిరసన తెలిపాయి. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.... ఈ అంశంపై అమెరికాకు నిరసన తెలిపామని వెల్లడించింది. ‘‘ఫిబ్రవరి ఐదున భారత్కు తిరిగి పంపినవారి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసిన విషయం అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యంగా, మహిళలకు సంకెళ్లు వేయడంపై మన అభ్యంతరాన్ని గట్టిగా తెలియజేశాం. ఆ తర్వాత అమెరికా వైఖరి మారింది. అదే నెల 15,16వ తేదీల్లో పంపిన మరో విడత అక్రమ వలసదారుల్లో పిల్లలు, స్ర్తీలకు సంకెళ్లు వేయలేదు’’ అని విదేశాంగశాఖ తెలిపింది. కాగా, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి నెలరోజుల్లో మొత్తంగా 37,600 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపించారు.
గ్రీన్కార్డు కోసం పెళ్లి చేసుకుంటే బహిష్కరణే!
ఐదేళ్ల జైలు, రూ.2కోట్ల ఫైన్ కూడా
అమెరికా పౌరులను వివాహం చేసుకోవడం ద్వారా వేగంగా గ్రీన్కార్డు పొందాలని భావించేవారికి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎ్ససీఐఎస్) గట్టి షాక్ ఇచ్చింది. వలస ప్రయోజనాలు పొందడానికి ఉద్దేశించిన మోసపూరిత వివాహాలు వ్యవస్థను బలహీనపరుస్తాయని, ఇటువంటి చర్యలను ఫెడరల్ నేరంగా పరిగణిస్తామని పేర్కొంది. దీనికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.2కోట్లకు పైగా జరిమానాతో పాటు బహిష్కరణకు కూడా దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు యూఎ్ససీఐఎస్ గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. వివాహం, వర్క్ వీసాల మోసాలు, ఇమిగ్రేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంల దుర్వినియోగం వంటి అనుమానాస్పద కేసుల సమాచారాన్ని తమకు నివేదించాలని పౌరులను కోరింది. ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన ఫాం ద్వారా పౌరులు తమకు సులభంగా సమాచారం ఇవ్వవచ్చని సూచించింది.
భారత విద్యార్థి సూరిని బహిష్కరించవద్దు అమెరికా ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టు ఆదేశం
హమా్సకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టయిన భారతీయ విద్యార్థి బాదర్ ఖాన్ సూరికి అమెరికా కోర్టులో ఊరట లభించింది. అమెరికా నుంచి అతని బహిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అతడిని అమెరికా నుంచి పంపేయడానికి వీల్లేదని జడ్జి పాట్రీసియా టోలీవర్ గైల్స్ తన తీర్పులో ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అంతకుముందు హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి సూరి విషయంలో ఓ ప్రకటన విడుదల చేశారు. జార్జిటౌన్ వర్సిటీ విద్యార్థి అయిన బాదర్ ఖాన్ సూరి హమా్సకు మద్దతుగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక ప్రచారం చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. ఆయన్ను అమెరికా నుంచి బహిష్కరిస్తామని 15న ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే