Micro Art: తొమ్మిదేళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామ నామం
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:23 AM
రామభక్తితో ఓ భక్తురాలు తొమ్మిదేళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామనామాలను మైక్రోఆర్ట్ పెన్స్తో రాస్తున్నారు. శ్రీరామ నమమి సందర్భంగా 7 రాష్ట్రాల్లోని 60 శ్రీసీతారామచంద్ర ఆలయాలకు 1,75,000 తలంబ్రాలను పంపారు.

మైక్రోఆర్ట్ పెన్నుతో రాస్తున్న చలువాది వందన
7 రాష్ట్రాల్లోని 60 ఆలయాలకు పంపిణీ
మియాపూర్,మార్చి 29(ఆంధ్రజ్యోతి): రామభక్తితో ఓ భక్తురాలు తొమ్మిదేళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామనామాలను మైక్రోఆర్ట్ పెన్స్తో రాస్తున్నారు. శ్రీరామ నమమి సందర్భంగా 7 రాష్ట్రాల్లోని 60 శ్రీసీతారామచంద్ర ఆలయాలకు 1,75,000 తలంబ్రాలను పంపారు. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చలువాది వందన నాలుగేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న భర్త నర్సింహరావు ప్రొత్సహంతో 9 ఏళ్లలో 10,75,000 బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాశారు.
అనేక రామాలయాలతో పాటు ఒంటిమిట్ట, భద్రాచలం దేవస్థానాలకు శ్రీరామనామం ఉన్న తలంబ్రాలు పంపారు. 2020లో ఆయోధ్య రామమందిరం భూమి పూజకు శ్రీరామనామం రాసిన 50,116 బియ్యపు గింజలను అందజేశారు. అమర వీరులు, స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రాలను కూడా బియ్యపు గింజలపై చిత్రించారు. దేశంలో ఆధ్యాత్మిక చింతన పెరగాలనేదే తన సంకల్పమని వందన తెలిపారు.