Etela Rajender: అడ్డగోలుగా అమ్ముకుంటే ఊరుకోం:ఈటల
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:32 AM
కంచ గచ్చిబౌలి భూములను అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : కంచ గచ్చిబౌలి భూములను అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలుచేయలేక చతికిల పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో ఫ్యాక్టరీలు, సంస్థలు పెట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలి తప్ప వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎంగా రేవంత్ కొత్త కావచ్చని, కానీ వాళ్ల పార్టీ కొత్త కాదని.. ఇలాంటి హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని ఈటల సూచించారు.
కాగా పలువురు కేంద్రమంత్రులతో తన భేటీల వివరాలను ఎంపీ ఈటల వెల్లడించారు. తన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్యూబీ, ఆర్వోబీలను నిర్మించాలని రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు సుచిత్ర రైల్వేస్టేషన్కు రక్షణశాఖ భూముల నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరినట్లు చెప్పారు.