Share News

డబుల్‌ ఆశలు..

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:53 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది.

డబుల్‌ ఆశలు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. దశలవారీగా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా సర్వే చేసి గ్రామ సభలు నిర్వహించారు. తొలి విడత నిర్మాణాలకు గ్రౌండింగ్‌ పక్రియ మొదలైంది. ఇదేక్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసంపూర్తిగా మిగిలిపోయిన వాటిని కూడా ప్రభుత్వం పూర్తిచేసి ఇందిరమ్మ ఇళ్లతో పాటు లబ్ధిదారులకు అందించే విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. జిల్లాలో అసంపూర్తిగా మిగిలిపోయిన 702 ఇళ్ల నిర్మాణాలు పూర్తికానున్నాయి. మరోవైపు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గత ప్రభుత్వ హయాంలో 3,448 మంది లబ్ధిదారులకు అందించారు. ఇప్పటివరకు రూ.188.49 కోట్లు ఖర్చు చేశారు. పంపిణీ చేసిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీల్లో లబ్ధిదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు, తాగునీరు, వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని భావించినా ప్రభుత్వం మారడంతో ఆచరణలోకి రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్న నేపథ్యంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

జిల్లాలో 3,546 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి 6,886 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరుచేశారు. ఇందుకోసం రూ.374.41 కోట్ల నిధులు వ్యయంగా నిర్ణయించారు. ఇందులో 5,437 ఇళ్లకు మాత్రమే టెండర్‌ పక్రియ పూర్తిచేశారు. 4,248 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 3,546 ఇళ్లు పూర్తిచేశారు. ఇందులో 3,448 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. రూ.188.49 కోట్లు ఖర్చు చేశారు. 702 ఇళ్లు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. కొన్ని ఇళ్లు దాదాపు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేక పంపిణీకి నోచుకోవడం లేదు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోనూ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా అనేక వివాదాల మధ్య అందించడం లేదు. పూర్తయిన ఇళ్లు కేటాయింపులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా అసాంఽఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో సిరిసిల్ల మండలంలో 2,052 ఇళ్ల లక్ష్యాన్ని పూర్తిచేశారు. ముస్తాబాద్‌లో 702 ఇళ్లకు 429, తంగళ్లపల్లిలో 549 ఇళ్లకు 110, ఎల్లారెడ్డిపేటలో 490ఇళ్లకు 320, గంభీరావుపేటలో 476ఇళ్లకు 371, వీర్నపల్లిలో 160ఇళ్లు మంజూరుకాగా 50 ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఒక్కటి కూడా పూర్తికాలేదు. ఇల్లంతకుంటలో 340ఇళ్లకు 184 పూర్తిచేశారు. వేములవాడ రూరల్‌ మండలంలో 1,080ఇళ్లకు 80ఇళ్లు పూర్తికాగా, వేములవాడ అర్బన్‌లో 800 ఇళ్లకు ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తికాలేదు. కోనరావుపేట మండలంలో 92, చందుర్తిలో 45, రుద్రంగిలో 35, బోయినపల్లిలో 65ఇళ్లు మంజూరైనా ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కాకుండానే లబ్ధిదారుల్లో నిరాశ నింపింది. ప్రధానంగా వేములవాడ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిరాశనే కల్పించింది. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే సగం కూడా పూర్తి కాలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు ప్రారంభం కాని ముస్తాబాద్‌లో 175ఇళ్లు, తంగళ్లపల్లిలో 178, ఎల్లారెడ్డిపేటలో 106, గంభీరావుపేటలో 43, వీర్నపల్లిలో 87, ఇల్లంతకుంటలో 156, వేములవాడ రూరల్‌లో 1000, వేములవాడ అర్బన్‌లో 656, కోనరావుపేటలో 92, చందుర్తిలో 45, రుద్రంగిలో 35, బోయినపల్లిలో 65ఇళ్లు టెండర్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.

ఇందిరమ్మ ఇళ్లకు లక్షకు పైగా దరఖాస్తులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 1,07,398 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హులను గుర్తించడానికి డిసెంబరు, జనవరిలో సర్వే చేశారు. గ్రామసభలు నిర్వహించారు. తాజా బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ ఆశలు కల్పించింది. జిల్లాలో మొదటి విడతగా మూడు కేటగిరీలుగా దరఖాస్తులను విభజించారు. ఎల్‌ 1లో 4,653 దరఖాస్తులు, ఎల్‌ 2లో 1,415 దరఖాస్తులు, ఎల్‌ 3లో 3,287 దరఖాస్తులను గుర్తించి ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేశారు. వీటిలో ఎల్‌ 1లో స్థలం ఉన్నావారు, ఎల్‌ 2లో సొంత స్థలం లేనివారు, ఎల్‌ 3లో మరోసారి ఏఐ ద్వారా పరిశీలించడానికి నిర్ణయించారు. ప్రస్తుతం మంజూరీలో 1,085 దరఖాస్తులు అర్హులుగా గుర్తించారు. ఇందులో 112 గ్రౌడింగ్‌ చేశారు. ఎల్‌ 1లో అర్హులుగా గ్రౌండింగ్‌ చేస్తున్న వాటిలో బోయినపల్లి మండలం అనంతపల్లిలో 109, చందుర్తి మండలం కొత్తపేటలో 17, ఇల్లంతకుంట మండలం సిరికొండలో 107, గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో 141, కోనరావుపేట మండలం గొల్లపల్లి(కొలనూర్‌) 33, ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌లో 78, రుద్రంగి మండలం గాయిదిగుట్ట తండా 44, తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో 102, వీర్నపల్లి మండలం లాల్‌సింగ్‌ తండా 107, వేములవాడ రూరల్‌ మండలం వెంకటాంపల్లిలో 27, వేములవాడ మండలం శాభాష్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో 18, ఎల్లారెడ్డిపేట మండలం గుండారం(పాటిచెర్ల) 184, సిరిసిల్ల మున్సిపాలిటీలో పెద్దూర్‌లో 118 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యతగా నిరుపేదలు, దళితులు, గిరిజనులు వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల్లో దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ మైనార్టీలకు 50 శాతం, జనరల్‌ కేటగిరీ కింద 15 శాతం చొప్పున ఇళ్లను కేటాయించనున్నారు. ఇంటి నిర్మాణంలో పునాది స్థాయిలో రూ.లక్ష, రెండో దశలో రూ.1.25 లక్షలు, మూడో దశలో స్లాబ్‌కు రూ.1.75 లక్షలు, ఫినిషింగ్‌, ఇతర దశలకు రూ.లక్ష చొప్పున అందించనున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:54 AM