Share News

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డుప్రమాదాల నివారణ

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:24 AM

:ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంలో భాగంగా శుక్రవారం ‘సురక్షిత ప్రయాణం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డుప్రమాదాల నివారణ
బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎస్పీ అశోక్‌ కుమార్‌

- ఎస్పీ అశోక్‌ కుమార్‌

- ‘సురక్షిత ప్రయాణం’ కార్యక్రమానికి శ్రీకారం

జగిత్యాల క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) :ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంలో భాగంగా శుక్రవారం ‘సురక్షిత ప్రయాణం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాలను(బ్లాక్‌ స్పాట్‌) నేషనల్‌ హైవే అథారిటీ, పోలీస్‌ అధికారులతో కలిసి ఎస్పీ సందర్శించి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో అధిక రోడ్డు ప్రమాదాలు జరిగే 43 ప్రాంతాలను గుర్తించి వివిధ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పోలీస్‌ కళాజాతా బృందాలతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పెట్రోల్‌ బంకులు, దాబాల్లో పనిచేసే వారికి హైవేలపై జరిగే ప్రమాదాలకు సంబంధించి తక్షణమే స్పందించే విధంగా వారికి వివిధ రకాల చికిత్సలపై అవగాహన కల్పించామన్నారు. సురక్షిత ప్రయాణం అనే కొత్త కార్యక్రమం ద్వారా మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులతో పాటు స్పీడు బ్రేకర్లను తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అఽధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధిక ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘచందర్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ రఫీక్‌ ఖాన్‌, సీఐలు వేణు గోపాల్‌, కష్ణారెడ్డి, రవి, ఎస్సైలు సధాకర్‌, నరేష్‌, మల్లేశం, నేషనల్‌ హైవే అధారిటీ ఏఈ లక్ష్మణ్‌, ఏఎంవీఐ ప్రమీల తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:24 AM