Share News

‘ఆసరా’కు నిరీక్షణ

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:57 AM

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆసరా పెన్షన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు కళ్లలో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. 2022 జూలై నుంచి ఆసరా పెన్షన్ల సైట్‌ ఓపెన్‌ చేయక పోవడంతో అర్హులైన అనేక మంది మున్సిపాలిటీలు, తహసీల్దార్‌ కార్యాలయాలు, గ్రామపంచాయతీల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ప్రభుత్వం 57 ఏళ్ల వయసుపె వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో చాలా మంది పెన్షన్లపై ఆశలు పెట్టుకున్నారు.

‘ఆసరా’కు నిరీక్షణ

- మూడేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు లేదు

- వేల సంఖ్యలో దరఖాస్తుల పెండింగ్‌

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆసరా పెన్షన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు కళ్లలో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. 2022 జూలై నుంచి ఆసరా పెన్షన్ల సైట్‌ ఓపెన్‌ చేయక పోవడంతో అర్హులైన అనేక మంది మున్సిపాలిటీలు, తహసీల్దార్‌ కార్యాలయాలు, గ్రామపంచాయతీల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ప్రభుత్వం 57 ఏళ్ల వయసుపె వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో చాలా మంది పెన్షన్లపై ఆశలు పెట్టుకున్నారు. అర్హులైన అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేశారు. సంబధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాక పోవడంతో వారందరికి పెన్షన్‌ అంద లేదు.

ఫ పెరగని పెన్షన్లు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లను పెంచి చేయూత పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ల విషయాన్ని ఊసెత్త లేదు. గత ఏడాది, ఈ యేడాది బడ్జెట్‌లో పెన్షన్లకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు పెంచలేదు. దీంతో పెన్షనర్ల ఆశలు అడియాశలయ్యాయి. మూడేళ్లుగా కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితోపాటు ప్రస్తుతం ఆసరా పథకం ద్వారా పించన్లు పొందుతున్న వారు కూడా పెన్షన్ల మొత్తాన్ని పెంచక పోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని దాదాపు 6వేల మంది ఆసరా పెన్షన్లకు అర్హులుగా పేర్కొంటూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా పింఛన్‌ మంజూరు చేయలేదు. దీనితో వారంతా మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది చనిపోగా, ప్రస్తుతం ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో కూడా కొంత మంది వారి ఆశలు నెరవేరకుండానే కళ్లు మూశారు. 2022 జూలై నుంచి ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుడు మృతిచెందితే వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అర్హులైన వారందరికి కొత్త పించన్లు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:57 AM