TG Cabinet Expansion: వారంలో విస్తరణ!
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:08 AM
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి రావడం ఖాయమైంది. కొన్ని ముఖ్యమైన నేతలకు అవకాశాలు కల్పించేందుకు చర్చలు జరుగుతున్నాయి. కీలకంగా, నలుగురు సభ్యుల నియామకానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోబడ్డాయి, మిగిలిన రెండు పదవులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం
రేసులో సుదర్శన్రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి
పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు!
ఏఐసీసీ పెద్దలతో రేవంత్, భట్టి, మహేశ్, ఉత్తమ్ భేటీ
ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు
క్యాబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేశ్ కుమార్
లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం?
న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లగా, 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్లి, అందరి కంటే ముందే బయటికి వచ్చేశారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగేది మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో నలుగురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే చాన్స్ ఉన్నట్టు అభిప్రాయపడుతున్నాయి.
ఆ నలుగురేనా?
ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొంతమంది కీలక నేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అంశంపై సమావేశంలో కీలకంగా చర్చించినట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలకు అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్రెడ్డిల పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టుబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నెలకొన్న పరిస్థితిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకాటి శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి పేర్లు ముందు వరసలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురికే చోటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో రెండు మంత్రి పదవుల భర్తీపై ఎలాంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కీలకంగా వినిపిస్తోంది. దీనిపైనా చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రివర్గంలో ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పక్షంలో డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ, కార్పొరేషన్ పదవులపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విస్తరణ, పీసీసీ పదవులు, సంక్షేమ పథకాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించామన్నారు. అన్ని విషయాలను వారికి వివరించామని అన్నారు. ఏఐసీసీ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నర పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాహుల్ చెప్పారన్నారు. రాష్ట్రంలో ఆ రెండూ అమలు అవుతున్న తీరును ఆరా తీశారని చెప్పారు. సమీకృత గురుకులాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై కూడా చర్చ జరిగిందని వెల్లడించారు. త్వరలోనే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గాలపై అధిష్ఠానంతో ఇదే చివరి సమావేశమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News