KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:14 PM
KTR: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. కానీ రాష్ట్ర బడ్జెట్లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాధాకరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై అసెంబ్లీలో కేటీఆర్ చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఆశ్చర్యమేస్తోందని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే మీరు.. కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని కేటీఆర్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో తమకు వచ్చింది సున్నా అయితే.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చింది కూడా గుండుసున్నా అని విమర్శలు చేశారు. కొట్లాడకపోతే కేంద్రం నిధులివ్వదు.. పోరాడాల్సిందేనని చెప్పారు. కేంద్రంపై పోరాడేందుకు రేవంత్ ప్రభుత్వానికి తాము మద్దతిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. పసుపు బోర్డుకు కేంద్ర బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు.. కానీ తెలంగాణలోని పరిశ్రమలను మాత్రం మూసివేస్తారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని ఆలయాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. సమ్మక్క - సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుంది.. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. పదేళ్లలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని ప్రచారం చేశారన్నారు. తమ హయాంలో ఏడాదికి రూ.40వేల కోట్లు మాత్రమే అప్పు చేశామని తెలిపారు. అప్పు చేసి అభివృద్ధి చేశాం.. ఇదే విషయాన్ని కాగ్ చెప్పిందని గుర్తుచేశారు. ఈ ఏడాదిలోనే కాంగ్రెస్ రూ.1.58లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ధాన్యం ఉత్పత్తిలో 2022లోనే హర్యానా, పంజాబ్ను తెలంగాణ మించిపోయిందని ఉద్ఘాటించారు. సాగుకు ఉచిత విద్యుత్ కోసమే రూ.61వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Revanth Reddy: డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..
CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్
Read Latest Telangana News and Telugu News