Share News

Israel- Hamas War: ఇజ్రాయెల్ దాడులతో సగం గాజా ఖాళీ.. ఏకంగా మిలియన్ మంది ప్రజలు..

ABN , First Publish Date - 2023-10-16T09:54:19+05:30 IST

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Israel- Hamas War: ఇజ్రాయెల్ దాడులతో సగం గాజా ఖాళీ.. ఏకంగా మిలియన్ మంది ప్రజలు..

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. భీకర దాడులతో ఇజ్రాయెల్-హమాస్‌లో పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. రెండు దేశాల్లోని హృదయ విదారక ఘటనలు మనసును కలిచివేస్తున్నాయి. పాలస్తీనా గ్రూప్ హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభించినప్పటిని నుంచి ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఒక మిలియన్ ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ హెచ్చరికలతో వారంతా సురక్షిత మార్గాల ద్వారా తప్పించుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. కాగా గాజా మొత్తంలో నివసించే జనాభాలో ఉత్తర గాజాలోనే దాదాపు సగం మంది నివసిస్తున్నారు. గాజా మొత్తంలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా.. ఉత్తర గాజాలోనే 1.1 మిలియన్ల మంది నివసిస్తున్నారు.


మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ భూదాడికి సిద్దమవుతోంది. ఇందులో సన్నాహకంగానే గాజా శివార్లలో సైన్యం, సాయుధ వాహనాలను మోహరించింది. అక్టోబర్ 6న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 1,400 మరణించారు. వందల మంది కిడ్నాప్‌నకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగానే హమాస్‌పై తిరిగి దాడి చేస్తున్నామని.. హమాస్ కార్యకర్తలు, కార్యచరణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అధికారులు గాజాపై ఏదైనా భూదాడి చేయాలంటే అది "రాజకీయ నిర్ణయం"పై ఆధారపడి ఉంటుందని నెతన్యాహు తెలిపారు. కాగా ఇప్పటికే గాజాపై ఇజ్రాయెల్ చేసిన నిరంతర బాంబు దాడుల్లో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా మరణించారు. మరోవైపు గాజాకు నీరు, విద్యుత్, ఆహారాన్ని ఇజ్రాయెల్ నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది. అక్టోబరు 7న జరిగిన దాడులకు గాజాలోని హమాస్ కమాండర్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ బాధ్యుడిగా పేర్కొంది. హమాస్‌లోని సొరంగాలు, భూగర్భ బంకర్లలో కిడ్నాప్ చేసిన ఇజ్రాయెల్ పౌరులను దాచినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సొరంగాలు, భూగర్భ బంకర్లలో బందీలుగా ఉన్న తమ 150 మందిని రక్షించడం ఇజ్రాయెల్ సైన్యానికి సవాలుగా మారింది.

మరోవైపు భూదాడి భయంకరమైన పరిణామాల గురించి ఇజ్రాయెల్‌కు అరబ్ లీగ్, ఆఫ్రికన్ యూనియన్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాయి. ఈ పరిణామం మారణహోమానికి దారి తీస్తుందని హెచ్చరించాయి. అలాగే ఇజ్రాయెల్‌లో కిబ్బట్జ్ నిరిమ్ మారణకాండకు కారణమైన హమాస్ అగ్ర కమాండర్ బిల్లాల్ అల్ కేద్రా.. గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న ఖాన్ యునిస్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించాడు. ఇస్లామిస్ట్ గ్రూప్ వైమానిక కార్యకలాపాలకు నేతృత్వం వహించిన హమాస్ సీనియర్ మిలటరీ కమాండర్ మురాద్ అబు మురాద్ శనివారం గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హతమయ్యాడు. కాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ యుద్ధం తీవ్రతను తగ్గించాలని కోరారు. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని హమాస్‌ను కోరారు. మిస్టర్ గుటెర్రెస్ ఇజ్రాయెల్‌ను గాజాలోకి మానవతా సహాయం కోసం ఒక మార్గాన్ని అనుమతించమని అభ్యర్థించారు. అలాగే గాజా ప్రాంతం "అగాధం అంచున ఉంది" అని చెప్పారు. ఈజిప్టు నియంత్రణలో ఉన్న రఫా, గాజాలోకి ప్రవేశించే సరిహద్దు మళ్లీ తెరవాలని ఆయన భావించారు.

Updated Date - 2023-10-16T09:54:19+05:30 IST