Chief Minister: ఆ కాల్వలను త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2023-08-04T08:44:37+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో చేపడుతున్న వాననీటి కాల్వ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అధికారుల

Chief Minister: ఆ కాల్వలను త్వరగా పూర్తి చేయండి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో చేపడుతున్న వాననీటి కాల్వ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అధికారులను పురమాయించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో రూ.178.91 కోట్లతో నిర్మిస్తున్న వాననీటి కాల్వ నిర్మాణ పనులను గురువారం ఉదయం సీఎం తనిఖీ చేశారు. ఆలందూరు జోన్‌ పరిధిలోని ఎంజీఆర్‌ రోడ్డులో రూ.71.31 లక్షలతో నిర్మిస్తున్న వాననీటి కాల్వను ఆయన పరిశీలించారు. హిందూ కాలానీ 4వ వీధి, ఎంజీఆర్‌ జంక్షన్‌ నుంచి నంగనల్లూరు వందడుగుల రహదారి, నంగనల్లూరు 47వ వీధి, ఆరవ మెయిన్‌ రోడ్డు, కుబేర మునసామి రోడ్డు మీదుగా వీరంగల్‌ వాగు వరకు 2.29 కి.మీ పొడవైన వాననీటి కాలువ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం 1.78 కి.మీ నిర్మాణం పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలాఖరుకల్లా పెండింగ్‌ పనుల సహా నగరవ్యాప్తంగా వున్న కాలువల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పోలీసుస్టేషన్‌లో తనిఖీ...

వాననీటి కాల్వల నిర్మాణ పనుల పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్‌ పోరూరుకు వెళ్తూ మార్గమధ్యంలో పల్లవన్‌తాంగళ్‌ పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏప్రిల్‌ 12న ప్రారంభమైన ఆ పోలీసుస్టేషన్‌(Police Station) గురించి పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని హాజరుపట్టీని పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి పోరూరు చేరుకున్నారు. నీటివనరుల శాఖ ఆధ్వర్యంలో పోరూరు చెరువు కుడివైపు గట్టును ఆనుకుని 26 మీటర్ల పొడవున మూతతో కూడిన కాలువ నిర్మాణ పనులను కూడా ఆయన తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆయన అశోక్‌నగర్‌కు వెళ్ళి అక్కడి నాలుగో అవెన్యూ తదితర ప్రాంతాల్లో రూ.7.60 కోట్లతో చేపడుతున్న వాననీటి కాల్వ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీలలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పొన్ముడి, దామో అన్బరసన్‌, మేయర్‌ ఆర్‌.ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, నీటి వనరుల శాఖ అదనపు ప్రఽధాన కార్యదర్శి సందీప్‌ సక్సేనా, కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.రాధాకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

nani5.jpg

పనులు పూర్తి చేయండి: సీఎస్‌

పెరంబూర్‌: చెన్నై సహా శివారు ప్రాంతాల్లో చేపట్టిన వర్షపు కాలువల పనులు ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి ముందే ముగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా(Shivdas Meena) అధికారులను ఆదేశించారు. రుతుపవన వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా కాలువల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పనులను జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

Updated Date - 2023-08-04T08:44:39+05:30 IST