Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. విధులు విస్మరించి విమర్శించడమే ఆయన పని

ABN , First Publish Date - 2023-08-01T09:19:31+05:30 IST

రాష్ట్ర శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లుల్ని ఆమోదించడం తప్ప తక్కిన పనులన్నీ రాష్ట్ర గవర్నర్‌ చక్కగా నిర్వహిస్తున్నారని ఆర్థిక మంత్రి తంగం

Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. విధులు విస్మరించి విమర్శించడమే ఆయన పని

- గవర్నర్‌ తీరుపై మంత్రి తంగం తెన్నరసు ధ్వజం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లుల్ని ఆమోదించడం తప్ప తక్కిన పనులన్నీ రాష్ట్ర గవర్నర్‌ చక్కగా నిర్వహిస్తున్నారని ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు(Minister Thangam Tennarasu) ఎద్దేవా చేశారు. గవర్నర్‌గా నియమితులైనప్పటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండటం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తిరుక్కురళ్‌ అనువాదం సరిగా లేదనడం, వళ్లలార్‌ కీర్తనల్లో లోపాలున్నాయా అని పరిశీలించడం, తరచూ సనాతన ధర్మమే మంచిదంటూ ప్రకటించడం వంటి విషయాలపైనే గవర్నర్‌ దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. ‘ద్రావిడం’ అనే పదం వింటే గవర్నర్‌కు మంటపుడుతుందని, ఆదివారం బీజేపీ దివంగత నాయకుడు దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రంథావిష్కరణ సభలో ద్రావిడం గురించి మాట్లాడటం వేర్పాటు వాదాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారని, ఏ కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయలేదన్నారు. ద్రావిడం అనే పదం సమైక్యతను చాటుతుందే తప్ప వేర్పాటు వాదానికి ఊతమివ్వదనే విషయం గవర్నర్‌కు తెలియకపోవడం శోచనీయమన్నారు. గవర్నర్‌ తన విధులను పూర్తిగా విస్మరించి ప్రభుత్వంపై, డీఎంకే సిద్ధాంతాలపై అదే పనిగా విమర్శలు చేయడమే తన ప్రధాన విద్యుక్తధర్మమనే భావనలోనే కొట్టుమిట్టాడుతున్నారని తంగం తెన్నరసు ఆరోపించారు.

Updated Date - 2023-08-01T09:19:31+05:30 IST