Daggubati: రాజకీయాలకు చంద్రబాబు తోడల్లుడు గుడ్‌బై.. వైరాగ్యానికి అసలు కారణం అదేనా..?

ABN , First Publish Date - 2023-01-16T18:54:16+05:30 IST

ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విలువలతో కూడిన రాజకీయాలు లేవని..

Daggubati: రాజకీయాలకు చంద్రబాబు తోడల్లుడు గుడ్‌బై.. వైరాగ్యానికి అసలు కారణం అదేనా..?

ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విలువలతో కూడిన రాజకీయాలు లేవని, డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందామని ఆయన ప్రకటించడం గమనార్హం. అందుకనే ఇక తమ కుటుంబంలో తాను, తన కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు దగ్గుబాటి చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలు చేస్తున్న నాయకులు వారసులను ప్రోత్సహిస్తుంటే, వారసులకు పార్టీ టికెట్ల కోసం పట్టుబడుతున్న ఈరోజుల్లో తన కొడుకు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాడని దగ్గుబాటి చేసిన ప్రకటన ఆసక్తికర చర్చకు తావిచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజకీయాలపై ఇంతటి నిర్వేదం ఎందుకు కలిగింది..? ఆయన కుమారుడిని కూడా రాజకీయాలకు దూరం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..? దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి (Daggubati Purandeswari) భర్త బాటనే ఎంచుకుంటారా..? దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కలిసిరాని రాజకీయంపై ప్రత్యేక కథనం.

ఎన్టీఆర్ అల్లుడిగా, చంద్రబాబు తోడల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. కారంచేడుకు చెందిన ఆయన ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని వివాహం చేసుకున్నారు. 1985, 1989 ఎన్నికల్లో పర్చూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆరోగ్య శాఖా మంత్రిగా దగ్గుబాటి పనిచేశారు. ఆ తర్వాత.. రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. చాలా ఏళ్ల తర్వాత 2004 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసిన పరిణామం. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా 2004, 2009 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసిన దగ్గుబాటి విజయం సాధించారు. ఆ సమయంలోనే.. పురంధేశ్వరి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పదేళ్ల పాటు ఆమె మంత్రిగా కొనసాగారు.

Daggubati1.jpg

2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్‌తో మంతనాలు జరిపి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. తన కుమారుడికి పర్చూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలనే ఒప్పందంతో జగన్ పార్టీలో దగ్గుబాటి చేరారు. జగన్ కూడా హితేష్‌కు టికెట్ కేటాయించారు. కానీ.. హితేష్‌కు అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారడంతో చివరి నిమిషంలో హితేష్ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో.. మరో మార్గం లేక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు పరాభవం ఎదురైంది. అప్పటి నుంచీ రాజకీయాల పట్ల దగ్గుబాటి పెద్దగా ఆసక్తి చూపలేదు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే రాజకీయాలపై అనాసక్తి కనబర్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరారు.

Daggubati2.jpg

ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండి ఎమ్మెల్యే అయితే పరిస్థితులు ఎలా ఉండేవో తెలియదు గానీ ప్రతికూల ఫలితాలు రావడంతో దగ్గుబాటిలో మరోసారి రాజకీయ నైరాశ్యం అలుముకుంది. పైగా.. దగ్గుబాటికి వ్యతిరేకంగా పనిచేసిన రామనాథం బాబును తనను కనీసం సంప్రదించకుండా జగన్ పార్టీలోకి తీసుకోవడంతో ఈ పరిణామంపై దగ్గుబాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీకి తండ్రీకొడుకులిద్దరూ గుడ్‌బై చెప్పేశారు. అయితే.. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆయన కుమారుడు హితేష్‌కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

CBN-Daggubati.jpg

దగ్గుబాటికి గుండెపోటు వచ్చిన సమయంలో చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. అప్పటి నుంచి చంద్రబాబు కుటుంబంతో దగ్గుబాటి కుటుంబ సంబంధాలు మళ్లీ బలపడ్డాయి. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలో అసలు రాజకీయాల్లోనే కొనసాగకూడదని దగ్గుబాటి నిర్ణయించుకోవడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తాజాగా.. తన కుమారుడు కూడా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు తావిచ్చింది. దగ్గుబాటి భార్య పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతారా లేక భర్త, కుమారుడి బాటలో రాజకీయాలకు దూరం జరుగుతారోనన్న వాదన కూడా తెరపైకొచ్చింది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిర్ణయం ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసిందని చెప్పక తప్పదు.

దగ్గుబాటి తాజాగా చేసిన ప్రకటన యథాతథంగా..

‘‘డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందాం. అందుకనే ఇక మా కుటుంబంలో నేను, మా కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరుగుతున్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ఇంకొల్లు వచ్చాను.. మా ప్రజలకు నా మనసులో మాట చెప్పాలి. కొన్ని రాజకీయ విషయాలు మాట్లాడతాను. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మేం ఇమడలేమని నిర్ణయించుకున్నాం. లేచిన దగ్గర నుంచి నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు నేను మనసు చంపుకొని చేయలేను. అవసరమైతే, ప్రజాసేవ చేయాలనుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా నాకు అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తా. గతానికి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు పోలికలేదు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవు’’ అని దగ్గుపాటి అన్నారు. ఆయన సంక్షిప్త ప్రసంగం విన్న మండల స్థాయి నాయకులు, దగ్గుబాటి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

Updated Date - 2023-01-16T19:48:03+05:30 IST