KTR: రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్

ABN , First Publish Date - 2023-09-29T15:00:12+05:30 IST

వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులే.. నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం. ఇదే విషయం వరి ధాన్యం

KTR: రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్

వనపర్తి: రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ (Cm kcr) అని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండాలో రూ.425 కోట్ల రూపాయలతో చేపట్టిన 75 MLD సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘‘రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం. భవిష్యత్‌లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు. దూరదృష్టితో కేసీఆర్ ప్రత్యామ్నాయం పంటలను ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయ పంటలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే అవకాశం ఉందని గుర్తించి పంటల మార్పిడితో వ్యవసాయం బలోపేతం చేస్తున్నారు. ఒకనాడు చెరువు కింద చేను ఉంది అని చెప్పేది.. ఇప్పుడు చేను కిందకు చెరువు వచ్చింది అని తాడూరు మండలం ఐతోలు రైతు, ఎస్వీఎస్ యజమాని కృష్ణారెడ్డి చెప్పారు. నాడు మనకు అందకుండా కిందకుపోయిన కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి రైతుల పొలాలకు మళ్లిస్తున్నాం.’’ అని మంత్రి స్పష్టం చేశారు.

‘‘వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులే.. నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం. ఇదే విషయం వరి ధాన్యం కొనమని చెప్పిన కేంద్ర మంత్రికి చెబితే అది ఎలా సాధ్యం అని అపహాస్యం చేశారు. మేమే ఖర్చు భరిస్తాం ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పాం. వరి మాత్రమే సాగు చేయడం భావ్యం కాదు. దేశంలో అవసరమైన 70 శాతం వంటనూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు తెలంగాణ దారి చూపాలని కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా అయిల్ పామ్ సాగు చేసి ఆదర్శంగా నిలిచారు. సాగులో కష్టనష్టాలు తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పేందుకు వారు ముందుగా సాగుచేయడం అభినందనీయం. 14 కంపెనీలతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం .. అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులకు ప్రోత్సాహమిస్తాం. నాలుగేళ్లలో ఆయిల్ పామ్ పంట చేతికి వచ్చే వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. ఏడాదికి లక్ష పైచిలుకు ఆదాయం ఆయిల్ పామ్ సాగుతో సాధ్యం. వరి సాగు నుంచి రైతులు బయటకు రావాలి. ఆధునిక వ్యవసాయం వైపు మనందరం కలిసి నడవాలి. 2601 రైతు వేదికలతో వ్యవసాయ విస్తరణ అధికారులను అందుబాటులో ఉంచారు. కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి అధికారంలోకి వస్తాం. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మళ్లీ గెలుస్తారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉపాధి .. అవసరమైతే యువతకు ప్రభుత్వం నుంచి నైపుణ్య శిక్షణ. ఆహారశుద్ది పరిశ్రమలకు పెద్దపీట .. భవిష్యత్ లో తెలంగాణలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు.’’ దొరుకుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T15:00:12+05:30 IST