Share News

Amaravati : జగన్‌ నిర్లక్ష్యంతో ఆగిన గుడ్లు

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:43 AM

జగన్‌ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం సరఫరా దారులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఎగ్స్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రూ.112 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.66 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టింది.

Amaravati : జగన్‌ నిర్లక్ష్యంతో ఆగిన గుడ్లు

  • ఎగ్‌, చిక్కీల కాంట్రాక్టర్లకు 178 కోట్ల బకాయిలు

  • బకాయిలు చెల్లిస్తాం.. సరఫరాకు సహకరించండి: మంత్రి లోకేశ్‌

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం సరఫరా దారులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఎగ్స్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రూ.112 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.66 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టింది. దీంతో తాజాగా కాంట్రాక్టర్లు కొన్ని ప్రాంతాల్లో గుడ్లు సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్‌ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీగా బకాయిలు ఉండటం వల్లే సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు మంత్రికి వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ స్థాయిలో బకాయిలు ఎందుకు ఉన్నాయని అధికారులను లోకేశ్‌ ప్రశ్నించారు. గతేడాది డిసెంబరు నుంచి గుడ్లు కాంట్రాక్టర్లకు, ఆగస్టు నుంచి చిక్కీల కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారని అధికారులు వివరించారు. పిల్లలకు ఎక్కడా గుడ్లు, చిక్కీల పంపిణీ ఆగకూడదని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. త్వరలోనే బకాయిలు విడుదల చేస్తామని, సరఫరాకు సహకరించాలని కాంట్రాక్టర్లను కోరారు.

అలాగే ఉన్నత విద్య పరిధిలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు రూ.3,480 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఇటీవల సమీక్షలో అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుత కాంట్రాక్టర్లను గత ప్రభుత్వమే ఎంపిక చేసింది. టెండర్లు లేకుండా నేరుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. చిక్కీల కాంట్రాక్టర్లకు రెండేళ్లుగా టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిపై కాంట్రాక్టును పొడిగిస్తూ వచ్చింది. అప్పటి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చక్రం తిప్పి టెండర్లు లేకుండా చేశారు. టెండర్లకు వెళ్తే రేటు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ పాత కాంట్రాక్టర్లకు పాత రేటుపై కాంట్రాక్టు పొడిగించారు. మధ్యాహ్న భోజన పథకం అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు దీనిపై ప్రశ్నించకుండా అప్పటి ప్రభుత్వానికి సహకరించారు. కాంట్రాక్టర్లకు బొత్సతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఇప్పుడు సరఫరా ఆపేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 08:00 AM