Share News

వీరు మారరా?

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:36 AM

జగన్‌ పాలనలో కబ్జాలు, దౌర్జన్యాలపై నోరెత్తిన ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన పోలీసు అధికారులు ఇప్పటికీ ఎక్కడికక్కడ చక్రం తిప్పుతూనే ఉన్నారు.

వీరు మారరా?

క్షేత్రస్థాయిలో ఇంకా ‘వైసీపీ’ పోలీసులే

సొంత మనుషులను తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు, మంత్రులు

జగన్‌ హయాంలో ఐపీఎస్‌ల నుంచి సీఐలు, ఎస్‌ఐల దాకా అత్యధికులు అమలు చేసింది వైసీపీ చట్టమే! స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి చెప్పిందే వాళ్లకు వేదం! ఇప్పుడు... సర్కారు మారింది. జిల్లా స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలు దాదాపుగా ముగిశాయి! కానీ... క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? ‘వైసీపీ’ పోలీసు అధికారుల నుంచి విముక్తి ఎప్పుడు? ఇవి సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలు!

బాధితులపైనే ఎదురు కేసులతో హల్‌చల్‌

ఐదేళ్లు టీడీపీ శ్రేణులకు ఉక్కపోత

చాలా చోట్ల నేటికీ అదే ఎస్‌ఐలు, సీఐలు

ఐపీఎస్‌ల బదిలీలకే దాదాపు నెలన్నర

మరి కిందిస్థాయి అధికారుల మాటేమిటో?

పెరుగుతున్న పైరవీలు, బేరసారాలు

ప్రభుత్వం త్వరగా స్పందించాలనే అభిప్రాయం

నేడు శాంతిభద్రతలపై శ్వేతపత్రం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ పాలనలో కబ్జాలు, దౌర్జన్యాలపై నోరెత్తిన ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన పోలీసు అధికారులు ఇప్పటికీ ఎక్కడికక్కడ చక్రం తిప్పుతూనే ఉన్నారు. జిల్లా ఎస్పీలను బదిలీ చేయడానికే కొత్త సర్కారుకు దాదాపు 40 రోజులు పట్టింది. మరి... క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన ‘వైసీపీ’ అధికారుల్ని బదిలీ చేయడానికి ఇంకెన్ని నెలలు పడుతుందో తెలియడంలేదని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. దీనివల్ల మూడు నష్టాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. ఒకటి... కులముద్ర, పార్టీ ముద్ర వేసి ఇన్నేళ్లు సరైన ప్రాధాన్యం దక్కని అధికారులకు

ఇప్పటికీ న్యాయం జరగడంలేదు. రెండు... సరైన పోస్టింగ్‌ల కోసం అధికారులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మూడు... ఇప్పుడు కాకపోతే మరో నెలకో, రెండు నెలలకో బదిలీ చేయకమానరనే ఉద్దేశంతో ‘వైసీపీ’ పోలీసు అధికారులు శాంతిభద్రతలను గాలికి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని కొత్త ప్రభుత్వం తక్షణం చక్కదిద్దాలని పోలీసులు కోరుకుంటున్నారు.

ఇంకా వాళ్లే....

వైసీపీ హయాంలో కొందరు కీలక నేతలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో తమ సొంత మనుషులను ఎస్‌ఐలు, సీఐలుగా నియమించుకున్నారు. మరికొందరు అధికారులు... ‘మాకు మంచి పోస్టింగ్‌ ఇస్తే చాలు. మీరు చెప్పినట్లు వింటాం’ అంటూ వైసీపీ విధేయులుగా మారిపోయారు. ఇలాంటి అధికారులకు ఐదేళ్లపాటు చట్టం పట్టలేదు. పొలిటికల్‌ బాస్‌లు చెప్పినట్టల్లా నడుచుకున్నారు. ఈ క్రమంలో బాధితులపైనే కేసులు పెట్టారు. టీడీపీ సానుభూతిపరులు ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ వచ్చారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే.. కొట్టడం, బూతులు తిట్టడం షరామామూలే! ఇప్పుడు ప్రభుత్వం మారి నెలరోజులు దాటినా పోలీసు స్టేషన్లలో అదే అధికారులు కొనసాగుతున్నారు. వీళ్లుండగా తమకు ఎలా న్యాయం జరుగుతుందని గత సర్కారు బాధితులు వాపోతున్నారు.

లూప్‌లైన్‌ తప్పదని...

గత సర్కారులో అడ్డగోలు పనులు చేసిన పలువురు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు ఇప్పుడు విధి నిర్వహణను గాలికి వదిలేశారు. ‘ఎలాగూ మాకు లూప్‌లైన్‌ తప్పదు. తర్వాత వచ్చేవాళ్లు చూసుకుంటారులే’ అంటూ శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇలాంటి అధికారుల్లో పలువురు ఇప్పటికే తమను ప్రాధాన్యంలేని (లూప్‌లైన్‌) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. లూప్‌లైన్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పోలీసుల వినతుల్ని పర్సనల్‌ విభాగం ఐజీ కనీసం పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.

మళ్లీ వాళ్లకేనా...

క్షేత్రస్థాయి పోలీసు అధికారుల పోస్టింగుల్లో కొత్త ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో... పైరవీలూ జోరందుకున్నాయి. పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా... ఎక్కువ మంది శాసన సభ్యులు సిఫారసు కోసం డబ్బులు అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఐదేళ్లు లూప్‌లైన్లో ఉండి, సరిగా జీతాల్లేక ఇబ్బందులు పడ్ద తాము ఎక్కడి నుంచి డబ్బులు తేవాలని ఈ అధికారులు వాపోతున్నారు. అదే సమయంలో... గత ప్రభుత్వంలో ఇసుక, మైనింగ్‌, బెట్టింగ్‌, గుట్కా, మట్కా, గంజాయి, భూ కబ్జాల్లాంటి అక్రమాలకు సహకరించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన వైసీపీ ఖాకీలు ఏదో మార్గంలో కూటమి ఎమ్మెల్యేల వద్దకు నోట్ల కట్టలతో వస్తున్నారు. ‘పాత సంగతులు వదిలేయండి. ఈ సొమ్ములు పుచ్చుకుని మమ్మల్ని మీరు చూసుకోండి. మీరు చెప్పినట్లు వింటాం’ అని బేరం పెడుతున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు పోలీసు స్టేషన్లో సీఐగా పోస్టింగ్‌ దక్కించుకున్న శ్రీనివా్‌సపై తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆయనను మార్చాల్సి వచ్చింది. ఐదేళ్లుగా వీఆర్‌లో ఉన్న ఒక అధికారికి నల్లపాడు పోలీసు స్టేషన్లో పోస్టింగ్‌ వస్తుందని ప్రచారం జరగ్గా అందుకు పూర్తి భిన్నంగా వచ్చింది. గుంటూరులో సీఐలు సమావేశమై ‘నీకు ఆ స్టేషన్‌, నాకు ఈ స్టేషన్‌’ అని చర్చించుకుంటూ కొట్టుకునేదాకా వెళ్లారు.

అధికార పార్టీకే జై.. తెలివి మీరిన వైసీపీ ఖాకీలు ఈ ప్రభుత్వంలో ఎలా పని జరుగుతుందో తెలుసుకుని... గత ప్రభుత్వంలో తాను వేధింపులకు గురయ్యానని, పనిష్మెంట్లు ఇచ్చారని తప్పుడు ఆర్డర్లు సృష్టించి మరీ పోస్టింగ్‌లు దక్కించుకొంటున్నారు. అనంతపురం జిల్లాలో ఒక విజిలెన్స్‌ అధికారి అవినీతి భరించలేక గత ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి పోలీసు శాఖకు తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘మా ఊరు వ్యక్తి. నాకు నమ్మకస్తుడు. నాకు రేపు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు కావాల్సిందే’’ అంటూ సీఎంవో నుంచి విజిలెన్స్‌ ఉన్నతాధికారిపై ఒత్తిడి పెంచి రద్దు చేయించారు. ప్రభుత్వం మారగానే ఆ అధికారి అధికార పార్టీ నేత ఒకరిని ప్రసన్నం చేసుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించినందుకే తనను ఉన్నతాధికారులు వేధించారంటూ డ్రామాకు తెరలేపారు. ఇంకేముంది!! ఈ ప్రభుత్వంలోనూ ఆయనకు అదే విజిలెన్స్‌లో పోస్టింగ్‌ దక్కింది. తిరుమల తిరుపతి కొండపైన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేరు ఉన్న ఒక పోలీసు అధికారి ఎమ్మెల్యేలు, ఐపీఎ్‌సలను సైతం లెక్కచేయకుండా అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.

ఐపీఎ్‌సల బదిలీలతో సరిపెడితే చాలా?

పాలనాదక్షుడిగా పేరున్న చంద్రబాబు బ్యూరోక్రాట్ల బదిలీల్లో బాగా జాప్యం చేశారు. ఐపీఎ్‌సలకు పోస్టింగ్స్‌ ఇచ్చేందుకు నెలన్నర పట్టింది. కానీ, ప్రజలతో నేరుగా సం బంధాలు నెరిపి వారి సమస్యలు విని న్యాయం చేసే పోలీ సు స్టేషన్ల అధికారులను మార్చక పోవడం పట్ల బాధితు ల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గురువారం సీఎంచంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 18 , 2024 | 04:36 AM