Share News

పెద్దిరెడ్డి దోపిడీ చాలా పెద్దది

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:17 AM

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వాలు చేయని దుర్మార్గాలను జగన్‌ ప్రభుత్వం చేసిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.

పెద్దిరెడ్డి దోపిడీ చాలా పెద్దది

అటవీ, గనుల శాఖల్లో భారీ అవినీతి

కీలక శాఖల్లో డిప్యుటేషన్‌ అధికారులు

వనరుల దోపిడీకి కొత్త పంథా పెట్టారు

పోలవరం మట్టిలో 800 కోట్లు దోచేశారు

జగన్‌ వనరుల దోపిడీపై చంద్రబాబు ఫైర్‌

ఈ వారంలో మరో మూడు శ్వేతపత్రాలు

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వాలు చేయని దుర్మార్గాలను జగన్‌ ప్రభుత్వం చేసిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో సహజ వనరులను వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొల్లగొట్టారని, అవినీతిని శిఖర స్ధాయికి తీసుకెళ్లారని నిప్పులు చెరిగారు. సోమవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వాలేవీ గనులు, అటవీ శాఖలను ఒక్కరికే కట్టబెట్టలేదు. వేర్వేరు మంత్రులకు ఇచ్చారు. వేర్వేరు మంత్రులు ఉంటే గనుల కోసం, అడవులను అడ్డగోలుగా వ్యవహరించకుండా ఉంటారని అలా చేసేవారు. జగన్‌ మొదటిసారి ఈ రెండు శాఖలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే అప్పగించారు. ఈ రెండు శాఖలను చేతిలో పెట్టుకున్న పెద్దిరెడ్డి.. అటవీ ప్రాంతంలో అడ్డగోలుగా గనుల తవ్వకాలు జరిపారు. జగన్‌ ఇలాంటివి చాలా చేశారు. రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిని తీసుకువచ్చి పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైౖర్మన్‌ చేశారు. మిల్లర్లు ఏవైనా అక్రమాలు చేస్తే పౌర సరఫరాల కార్పొరేషన్‌ అడ్డుకోవాలి. ఆ కార్పొరేషన్‌ను మిల్లర్ల సంఘం అధ్యక్షుడి చేతిలో పెడితే ఏమనాలి? రేషన్‌ బియ్యం పంపిణీ కోసం వ్యాన్లు పెట్టారు. బియ్యం అక్రమ రవాణాకు అవే సాధనాలుగా మారాయి. వాటితోనే రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ జరిగింది. అన్నింటికీ ప్రాధమిక సాక్ష్యాలు సేకరిస్తున్నాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. అధికారుల పాత్రను కూడా లోతుగా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం నడవాలంటే అధికారులు ఉండాలి. అయితే, మితిమీరి తప్పులు చేసిన అధికారులను వదిలిపెట్టం. అదే సమయంలో ప్రభుత్వం పని ఆగకుండా అధికారులతో పని చేయించుకొనే మార్గాలు కూడా చూస్తున్నాం. తన దోపిడీకి జగన్‌ ప్రభుత్వం కొత్త కొత్త పద్ధతులు అవలంభించింది. బాగా ఆదాయం వచ్చేచోట ఇక్కడి అధికారులను కాకుండా బయటివారిని డిఫ్యుటేషన్‌పై తెచ్చి నియమించారు. గనుల శాఖ, ఖనిజ సంస్థ, బేవరేజెస్‌ కార్పొరేషన్‌, టీటీడీ, ఫైబర్‌ గ్రిడ్‌ వంటి చోట బయటి నుంచి వచ్చిన అధికారులను నియమించి అడ్డగోలు దోపిడీ చేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అక్రమ సంపాదన కోసం కాల్వల కట్టల మీద మట్టిని కూడా వదిలిపెట్టకుండా దోచుకొన్నారని తెలిపారు. ‘‘పోలవరం కుడి కాల్వ కోసం తవ్విన మట్టిని దాని పక్కనే కట్ట కింద పోశారు. ఆ మట్టి మొత్తం వేల సంఖ్యలో లారీలు పెట్టి తవ్వి అమ్ముకున్నారు. సుమారు రూ.800 కోట్ల మేర మట్టి అమ్మకాలు జరిగాయని అంచనా. కాల్వకు కట్టే లేకుండా మట్టిని తవ్వి అమ్ముకొంటే రేపు ఏదైనా వరద వస్తే కాల్వకు రక్షణ ఏది? మట్టి లేక కాల్వ కట్టలు బలహీనమై గండ్లు పడితే కిందకు నీళ్లు వెళ్లవు. రైతులు నష్టపోతారు. ఎవరు ఎటుపోయినా తమ జేబులు నిండితే చాలన్నట్లుగా వ్యవహరించారు. దీనిలో ఒకరు కాదు.. అనేక మంది పాత్ర ఉంది. ఒకరి పేరు చెబితే మిగిలిన వాళ్లు తప్పించుకొంటారు. ఎవరినీ వదలం. అందరినీ చట్టం ముందుకు తెస్తాం’’ అని చంద్రబాబు వివరించారు.

నేడు ఢిల్లీకి చంద్రబాబు రేపు కేంద్ర మంత్రి షాతో భేటీ

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం తొలుత ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. పలు అంశాలపై మంత్రివర్గంతో చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్తారు. బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తారు. అదే రోజు రాత్రికి రాష్ట్రానికి తిరిగి వస్తారు.

Updated Date - Jul 16 , 2024 | 04:17 AM