Share News

Shivraj Singh Chauhan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

ABN , Publish Date - Sep 06 , 2024 | 09:31 AM

తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వాహనాలు, పశు సంపద అంతా వర్షాలకు కొట్టుకుపోయింది.

Shivraj Singh Chauhan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వాహనాలు, పశు సంపద అంతా వర్షాలకు కొట్టుకుపోయింది. రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఇక ఏపీలో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలు కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని సాయం కోరుతూ లేఖ రాశారు. ఏపీ సైతం కేంద్రం సాయం కోరుతున్నాయి.


ఏపీ , తెలంగాణల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రోజుల పర్యటించనున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి రెండు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఏపీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంత రైతులతో కేంద్ర మంత్రి ఈ రోజు చర్చించనున్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.


నిన్న విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం... ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు, మంత్రులు, రాష్ట్ర అధికారులతో అర్థరాత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గురువారం రాత్రి ఆయన విజయవాడ కలెక్టరేట్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు. వరదలతో నష్టం భారీగా జరిగిందని, పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని, రైతులు చాలా నష్టపోయారని చెప్పారు. రాష్ట్రానికి పూర్తి మద్దతును కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 06 , 2024 | 09:31 AM