Share News

పొత్తు – ఎత్తు

ABN , Publish Date - Mar 10 , 2024 | 12:29 AM

టీడీపీ–జనసేన–బీజేపీ మూడు పార్టీల కలయికతో పొత్తు పొడిచింది. ఇప్పటి వరకు కొనసాగిన సందిగ్ధతకు తెరపడింది.

పొత్తు – ఎత్తు

మూడు పార్టీల కూటమి అదుర్స్‌

ఎంపీ స్థానాలపైనే పూర్తి ఉత్కంఠ

తపనాచౌదరి, రఘురామ పోటీపైనే దృష్టంతా

జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారు

దెందులూరు స్థానంపైనా కీలక నిర్ణయం

రెండ్రోజుల్లో ఉమ్మడి జాబితా ప్రకటన

అధికార వైసీపీలో ముచ్చెమటలు

టీడీపీ–జనసేన–బీజేపీ మూడు పార్టీల కలయికతో పొత్తు పొడిచింది. ఇప్పటి వరకు కొనసాగిన సందిగ్ధతకు తెరపడింది. అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించేలా ఉమ్మడిగా ఎత్తుగడలు. ఎవరు, ఎక్కడ, ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై పట్టువిడుపులో మూడు పార్టీలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే రాబోయే రెండ్రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఏలూరు, నరసాపురం లోక్‌సభా స్థానాలు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి ఏలూరు లోక్‌సభ స్థానం బీజేపీకి కేటాయిస్తారని, ఇక్కడ సీనియర్‌ నేత తపనచౌదరి పోటీ చేస్తారని భావించారు. ఇప్పుడు మూడు పార్టీలు ఎన్నికల పొత్తుకు వీలుగా సంసిద్ధం కావడంతో ఏలూరుపై అందరి దృష్టి పడింది. ఏలూరు లోక్‌సభ స్థానం బీజేపీ ఆశిస్తే, నరసాపురం వదులుకోవలసి వస్తుందని కొందరు, నరసాపురాన్ని బీజేపీ కావాలని పట్టుబడితే ఏలూరును వదులుకోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో తపనా చౌదరి, సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్లు అన్ని పార్టీల మధ్య నానుతున్నాయి. ఏలూరు లోక్‌సభ స్థానం దక్కకపోతే తపన చౌదరి ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి వీలుగా ప్రతిపాదిస్తారని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే కైకలూరు నుంచి పోటీకి వీలుగా ప్రతిపాదిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ స్థానంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ బీజేపీ ఆశావహుడిగా వున్నారు. నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే అక్కడి నుంచి పోటీకి వీలుగా రఘురామకృష్ణంరాజు సంసిద్ధంగా వున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస రాజు పోటీలో వున్నారు. తనకన్ని అర్హతలూ ఉన్నాయని, తన అభ్యర్థిత్వాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందన్న నమ్మకం తో ఆయన వున్నారు. ఎంపీ స్థానాలు కీలకం కావడంతో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. పొత్తులో స్థానాలన్నిటిపైన రెండ్రోజుల్లోనే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.,

పవన్‌ పోటీ ఎక్కడ ?

మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ రానున్న రాజకీయ సంగ్రామంలో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ఒక నిర్ణయానికి వచ్చాయి. సీట్ల సర్దుబాటు మీద ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చ సాగింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఒక సంఖ్యను నిర్ధారించారు. మూడు పార్టీల ఉమ్మడి పొత్తు, పోటీ ఇక గోదావరి జిల్లాల్లో అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించబోతున్నాయి. జనసేనకు పొత్తులో భాగంగా ఉమ్మడి పశ్చిమలో ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు నుంచి ధర్మరాజు, పోలవరం నుండి చిర్రి బాలరాజు అభ్యర్థిత్వాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. పోలవరంలో బాలరాజుతోపాటు మరికొందరు తుది ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిలో ఉన్నత చదువులు అభ్యసించిన మొడియం సూర్యచంద్రరావు జనసేన టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన తాత పోలవరం ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సూర్యచంద్రరావుతోపాటు విద్యావంతురాలైన కణితి అశ్విని పేరు తరచూ ప్రసార మాధ్యమాల్లో నానుతోంది. గత ఎన్నికల్లో చిర్రి బాలరాజు పోటీ చేసిన అనుభవం ఉండడంతో ఆయన వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోందని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి కీలక ప్రకటన రెండు రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించబోతున్నారు. తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు ఇప్పటికే ఖరారై వున్నందున ఈ స్థానాలకు దాదాపు ఒక స్పష్టత వచ్చింది. ఇక ఎటు తిరిగి భీమవరం నుండి పవన్‌ కల్యాణ్‌ ముందుగా పోటీ చేస్తారనుకున్నా, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. తన స్థానంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును అభ్యర్థిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి అనుకూలంగా జనసేన పూర్తిగా సంకేతాలు పంపడంతో ఇప్పటి వరకు దాకా టీడీపీలో వున్న ఆ పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లుగా వుంటున్న అంజిబాబు నేరుగా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన జనసేనకు వర్తమానం పంపడం, పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే వెల్లడించారు. ఇక సూత్రప్రాయంగా జనసేనలో చేరాల్సి వుంది. భీమవరం నుంచి తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ పోటీ చేస్తారని ఆయన అభిమానులతోపాటు మిగతా పార్టీలు ఊహించినా, దీనికి భిన్నంగా పవన్‌ అడుగులు వేస్తున్నారు. గడచిన రెండు రోజులుగా పవన్‌ కల్యాణ్‌ పార్లమెంట్‌ వైపే దృష్టి పెట్టారని, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేయబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై జనసేనలోనూ తర్జనభర్జన, అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమలోనే తమ పార్టీ ఆశించినట్లుగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం రావడం దీనిని నిలబెట్టుకుని విజయం సాధించడం ద్వారా గోదావరి జిల్లాల్లో నిలదొక్కుకోవాలనే కాంక్ష ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.

సీనియర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం

టీడీపీ తన పట్టున్న స్థానాలను జనసేనకు కేటాయించడం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్లను సర్దుకుపోవాలని ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునివ్వడం ఇంకో పరిణామం. తెలుగుదేశం దెందులూరు స్థానం నుంచి ఎవరిని పోటీకి దింపబోతుందో సోమవారం స్పష్టత ఇవ్వబోతోంది. సాధ్యమైనంత మేర చింతమనేని ప్రభాకర్‌కు అవకాశం వస్తుందని ఆయన అనుచరవర్గం ధీమాతోనే ఉంది. ఇంకోవైపు గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకట్రాజు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే వెంకట్రాజు గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి, హోం మంత్రి తానేటి వనితను మించి ఓటర్లను కలవడంలో పోటీ పడుతున్నారు. యువకుడైన తనకు అందరి మద్దతు ఉందని, విజయం తనవైపే ఉంటుందని ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఓ వైపు బుజ్జగింపుల పర్వం సాగుతున్నా.. టీడీపీ కేడర్‌ మాత్రం కొంత అసంతృప్తి, ఇంకొంత ఆగ్రహంతోనే ఉంది. ఇప్పటికే పోలవరంలో బొరగం శ్రీనివాస్‌, తాడేపల్లిగూ డెంలో వలవల బాబ్జీతో పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా సంభాషించినా, ఆయా నియోజకవర్గాల్లో కేడర్‌ మాత్రం తాజా నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. బుట్టాయగూ డెంలో సమావేశమైన పోలవరం టీడీపీ కేడర్‌, తాడేపల్లిగూ డెంలో సమావేశమైన కార్యకర్తలలో అత్యధికులు పార్టీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పట్టుబడుతున్నారు.

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా : బొరగం

బుట్టాయగూడెం, మార్చి 9: పార్టీ అధిష్ఠానం పోలవరం సీటు కేటాయింపులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టు బడి ఉంటానని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం బొరగం శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో శనివారం బుట్టాయగూడెం లో నియోజకవర్గ నాయకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పార్టీకి కంచుకోటలా నిలిచిన పోలవరం సీటును బొరగంకు ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాల కు సిద్ధపడతామని నాయకులు పేర్కొన్నారు. పొత్తు ధర్మా నికి తాము వ్యతిరేకం కాదని, విజయం సాధించగలిగిన అభ్యర్థికే సీటును కేటాయించాలని నినాదాలు చేశారు. 2019లో పార్టీ ఓటమి చెందిన నాటి నుంచి నేటి వరకు బొరగం ప్రజల్లోనే ఉంటూ పార్టీకి అభివద్ధికి కృషి చేశారని, ఈసారి ఆయనదే విజయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ విజయం సాధించగల అభ్యర్థుల విషయంలో అధిష్టానం పునఃపరిశీలన చేసి సీటును తనకే ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీటు విషయంలో నాయకులు, కార్యకర్తల నిర్ణయాన్ని గౌరవిస్తా నని స్పష్టం చేశారు. ఇక్కడి అందరి అభిప్రా యాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి టీడీపీకే సీటు వచ్చేలా ప్రయ త్నాలు చేద్దామని నాయకులు స్పష్టం చేశారు. సమావేశం లో శీలం వెంకటేశ్వరావు, పారేపల్లి రామారావు, ఉండవల్లి సోమసుందరం, గద్దె అబ్బులు, షేక్‌ సుభాని, చింతల వెంక టరమణ, మొగపర్తి సోంబాబు, యంట్రప్రగడ శ్రీనివాస రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

కైకలూరు వైసీపీకి బిగ్‌ షాక్‌ : ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా : వైసీపీ ఎస్సీ సెల్‌ కార్యదర్శి నోబుల్‌

కైకలూరు, మార్చి 9 : కైకలూరు నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది. ఎస్సీ సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు పార్టీపై తిరుగుబాటు చేశారు. పార్టీ కోసం పనిచేసి ఎన్నో అవమానాలకు గురయ్యానని దళిత నాయకుడు, వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి బొడ్డు నోబుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం కైకలూరులో దళితుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ ‘నియోజకవర్గంలో వైసీపీ కోసం కష్టపడి పనిచేశా. ఎక్కడా ఏ తప్పు చేయలేదు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో ఎన్నో అవమానాలు పొందా. ఇందువల్లే పార్టీ కార్యక్రమాలకు కొంత కాలం దూరంగా ఉన్నా. ఎమ్మెల్యే ఒక సమావేశంలో నన్ను బూతులు తిట్టారు. వార్డు సభ్యునిగా కూడా గెలవలేనని అవమానపరిచారు. నేను గతంలో ఎంపీటీసీగా గెలుపొందా. కాంగ్రెస్‌ బ్లాక్‌–1 అధ్యక్షునిగా పనిచేశా. అభిమానులంతా ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా’నని నోబుల్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూషించిన మాటల ఆడియోను వినిపించారు. నాయకులు అర్జా యోహన్‌, బండి ప్రసాద్‌, కురేళ్ళ ఇస్సాక్‌, గూడపాటి వరప్రసాద్‌, రత్నకుమార్‌, దండే సైమన్‌రాజు, తేరా రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2024 | 12:29 AM