Share News

Sheik Hasina : ఆ పగడపు ద్వీపం ఇవ్వనందుకే!

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:24 AM

బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..

Sheik Hasina : ఆ పగడపు ద్వీపం ఇవ్వనందుకే!

  • హసీనా పదవీచ్యుతికి సెయింట్‌ మార్టిన్సే కారణం?

  • ఇక్కడ సైనిక స్థావరానికి అమెరికా ప్రయత్నాలు..

  • బంగ్లా మాజీ ప్రధాని ససేమిరా.. దీంతోనే కుట్రలు

ఢాకా, ఆగస్టు 12: బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది.. అక్కడ స్థావరం ఏర్పాటు చేస్తామంటూ బంగ్లాదేశ్‌ను కోరింది. అయితే, దేశాధినేత ససేమిరా అన్నారు.

తన ప్రతిపాదనను కాదన్నందుకు ఆమెపై అగ్రరాజ్యం పగబట్టింది. పదవి నుంచి దించేసేవరకు నిద్రపోలేదు. ఇదంతా బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా పదవీచ్యుతి వెనుక ఉన్న నేపథ్యం అంటూ తాజాగా కథనాలు వస్తున్నాయి.

హసీనా కూడా సెయింట్‌ మార్టిన్స్‌లో వైమానిక స్థావరానికి అనుమతి ఇస్తే మీరు తిరిగి తేలిగ్గా పదవిలోకి వచ్చేలా చూస్తామని ఓ తెల్ల వ్యక్తి తనకు ప్రతిపాదించినట్లు జనవరిలో జరిగిన ఎన్నికలకు ముందు చెప్పినట్లు, అమెరికా కోరినట్లు చేసి ఉంటే తాను దిగిపోయే పరిస్థితి వచ్చేది కాదంటూ ఇటీవల వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపం బంగ్లాదేశ్‌లో అత్యంత కీలక వాణిజ్య ఓడరేవు అయిన కాక్స్‌ బజార్‌కు కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బంగ్లాదేశ్‌కు ఉన్న ఏకైక పగడపు దీవి అయిన సెయింట్‌ మార్టిన్‌.. అరుదైన జీవజాతులతో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం.


3 వేలకు మించని జనాభా

సెయింట్‌ మార్టిన్స్‌ జనాభా 3,800 మాత్రమే. చేపల వేట, వరి, కొబ్బరి తోటలు, సీ వీడ్‌ సాగు వీరి జీవనాధారం. ఎండబెట్టిన సీ వీడ్‌ను మయన్మార్‌కు ఎగుమతి చేస్తుంటారు. సహజ సౌందర్యం కారణంగా ఇటీవలి కాలంలో ఈ ద్వీపం పర్యాటక ప్రాంతంగానూ మారింది. కాగా, 1947లో భారత్‌ విభజన సమయంలో పాకిస్థాన్‌కు, 1971లో బంగ్లాదేశ్‌ పరిధిలోకి వెళ్లింది. అయితే, మయన్మార్‌కు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సముద్ర సరిహద్దులు, చేపల వేట విషయంలో బంగ్లా-మయన్మార్‌ మధ్యన తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.


అమెరికా కన్ను అందుకే..

మయన్మార్‌కే కాక, ప్రపంచంలోనే సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన మలక్కా జలసంధికి అతి సమీపంలో ఉండడంతో సెయింట్‌ మార్టిన్స్‌ ప్రాధాన్యంగా మారింది. ఇక కాక్స్‌బజార్‌లో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) కింద చైనా నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. అందుకే సెయింట్‌ మార్టిన్స్‌లో సైనిక స్థావరం ఏర్పాటు చేసి చైనా, మయన్మార్‌, భారత్‌పైనా ఉంచాలని అమెరికా భావించింది. హిందూ మహా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని మరింత పెంచేలా బీఆర్‌ఐలో బంగ్లా చేరడం కూడా ఆ దేశానికి అందోళన కలిగించింది.

Updated Date - Aug 13 , 2024 | 04:24 AM