Share News

Prime Minister Modi : మరో 3 కోట్ల ఇళ్లు

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:39 AM

ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా భారీఎత్తున ఇళ్ల నిర్మాణానికి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మూడో విడత ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. సోమవారం ప్రధాని మోదీ నివాసంలో మొదటిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ, పట్టణ పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించింది.

Prime Minister Modi : మరో 3 కోట్ల ఇళ్లు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మాణం.. గ్రామాలు,

పట్టణాల్లో మంజూరుకు ఆమోదం

  • కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయం

  • కోట్లాదిమంది జీవితం సుఖమయమే లక్ష్యం

  • ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం

  • ‘పీఎం కిసాన్‌’పై ప్రధాని మొదటి సంతకం

  • రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం: మోదీ

  • వచ్చే ఐదేళ్లు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి

  • నిత్య విద్యార్థిగా ఉండడమే విజయ రహస్యం

  • ఇది ప్రజల పీఎంవో: ప్రధాని మోదీ వ్యాఖ్య

  • రాష్ట్రాలకు రూ.1.40 లక్షల కోట్లు విడుదల

  • తెలంగాణకు రూ.2,900 కోట్లు మంజూరు

    Untitled-10 copy.jpg

న్యూఢిల్లీ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా భారీఎత్తున ఇళ్ల నిర్మాణానికి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మూడో విడత ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. సోమవారం ప్రధాని మోదీ నివాసంలో మొదటిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ, పట్టణ పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించింది. కోట్లాదిమంది గృహావసరాలను తీర్చేందుకు పీఎంఏవై దోహదం చేస్తుందని, పథకం విస్తరణ.. సమ్మిళిత వృద్ధి, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చాటుతుందని మోదీ ట్వీట్‌ చేశారు. దేశంలో ప్రతి పౌరుడు మెరుగైన జీవితం పొందేలా చూడడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.

కొన్నేళ్లుగా ఇంటి నిర్మాణానికి అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిందని, అందుకుతగినట్లుగా సాయం అందించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పదేళ్లలో పీఎంఏవై కింద 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. కాగా, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌-7లోని నివాసంలో జరిగిన సమావేశంలో మోదీ మొత్తం క్యాబినెట్‌ మంత్రుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరి నేపథ్యాలను తెలుసుకున్నారు. 18వ లోక్‌సభ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. ప్రధానిగా సోమవారం బాధ్యతలను స్వీకరించాక.. 17వ విడత ‘పీఎం కిసాన్‌’ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసి విధులను ప్రారంభించారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. తన కార్యాలయం ప్రజలకు కేంద్రంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ కేంద్రీకృతంగా ఉండకూడదని సూచించారు. 2014కు ముందు పీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని వ్యాఖ్యానించారు. దేశమే ప్రథమమని, అదే తన లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.

  • నా జీవితం దేశానికి అంకితం..

తన జీవితంలో ప్రతిక్షణం దేశం కోసమేనని మోదీ పునరుద్ఘాటించారు. అధికారం కోసమో, పదవి కోసమో తాను రాలేదని స్పష్టంచేశారు. 140 కోట్ల మంది ప్రజలు తనకు పరమాత్మతో సమానమని తెలిపారు. అభివృద్థికి పీఎంవో ఉద్యోగులు వారధి అని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. పీఎంవోపై దేశమంతా ఎంతో నమ్మకంతో ఉందని, ఎంతో విశ్వాసంతో ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లు వికసిత్‌ భారత్‌ కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేయాలని మోదీ సూచించారు. ‘‘మనం సమయం చూసుకొని, కాలానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులం కాదు. మన ఆలోచనలకు పరిమితి లేదు. ఎటువంటి పరిమితులు లేకుండా పని చేసేవారే నా జట్టు. అటువంటి ఆలోచనలు ఉన్న వారినే ఈ దేశం విశ్వసిస్తుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచంతో పోటీపడుతూ ముందుకెళ్లాలని, ఏ దేశం అందుకోలేనంత ఎత్తుకు భారత్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. గత పదేళ్లలో చేసిన దానికంటే, ఈ ఐదేళ్లలో మరింత ఎక్కువ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘‘ఎక్కువ మంది నా విజయ రహస్యం ఏమిటని అడుగుతుంటారు. నిత్యవిద్యార్థిగా ఉండటమే ఆ రహస్యం’’ అని మోదీ వివరించారు.


  • మోదీకి పాక్‌ ప్రధాని శుభాకాంక్షలు

భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీకి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన 6 రోజుల తర్వాత మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.

  • సిక్కిం సీఎంగా తమాంగ్‌ ప్రమాణం

ఈశాన్య రాష్ట్రం సిక్కిం ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎ్‌సకేఎం) అధినేత ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పల్జోర్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రేమ్‌సింగ్‌తో గవర్నర్‌ లక్ష్మణ్‌ ఆచార్య ప్రమాణం చేయించారు. సీఎం సహా 12 మంది మంత్రులు కూడా ప్రమాణాలు చేశారు. ఇదిలా ఉండగా, ఒడిశా కొత్త సీఎం ఎంపిక కోసం మంగళవారం పారీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనికి, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, భూపేంద్రయాదవ్‌ పరిశీలకులుగా వెళ్లనున్నారు. సీఎం రేసులో సురేశ్‌ పుజారీ, మన్మోహన్‌ సామల్‌, మోహన్‌ మాంఝీల పేర్లు ఉన్నాయి.

Updated Date - Jun 11 , 2024 | 05:39 AM