Share News

Defense Sector : ఆర్మీ అమ్ముల పొదిలో నాగాస్త్రం

ABN , Publish Date - Jun 15 , 2024 | 04:06 AM

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక ముందడుగు పడింది. తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్‌ నాగాస్త్ర-1 భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. నాగ్‌పూర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఎకనామిక్స్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిటెడ్‌ (ఈఈఎల్‌) ఈ యూఏవీ (మానవ రహిత విమానం) డ్రోన్లను తయారు చేసింది.

Defense Sector : ఆర్మీ అమ్ముల పొదిలో నాగాస్త్రం

  • తొలి విడతలో సైన్యానికి చేరిన 120 డ్రోన్లు

న్యూఢిల్లీ, జూన్‌ 14: రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక ముందడుగు పడింది. తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్‌ నాగాస్త్ర-1 భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. నాగ్‌పూర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఎకనామిక్స్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిటెడ్‌ (ఈఈఎల్‌) ఈ యూఏవీ (మానవ రహిత విమానం) డ్రోన్లను తయారు చేసింది. తొలి విడతలో భాగంగా 120 డ్రోన్లను ఆర్మీకి అందించింది. పుల్గావ్‌లోని డిపోకు వాటిని తరలించారు. 9 కేజీల బరువుండే ఈ పోర్టబుల్‌ డ్రోన్‌ గాలిలో ఏకధాటిగా 30 నిమిషాలు ఎగరగలదు. ఒక కేజీ బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. జీపీఎస్‌ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్‌ కామకేజ్‌ మోడ్‌లో అత్యుత్తమంగా పనిచేస్తుంది. లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడిచేస్తుంది. ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ కారణంగా నాగాస్త్ర-1 తక్కువ శబ్ధంతో ప్రయాణిస్తుంది. ఇది 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరితే శత్రువుకు దీన్ని గుర్తించడం కూడా కష్టమే. దీనిలో పగలు, రాత్రి పనిచేసేందుకు వీలుగా నిఘా కెమెరాలు ఉన్నాయి.

Updated Date - Jun 15 , 2024 | 04:07 AM