Share News

Local Media : ‘శంకర్‌ దాదా.. ఎంబీబీఎస్’లు!

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:10 AM

పశ్చిమబెంగాల్‌లో వైద్య విద్యలో భారీ కుంభకోణం జరిగినట్లు స్థానిక మీడియా ఆరోపించింది. పలువురు వైద్యులతో కూడిన ఈ శక్తిమంతమైన లాబీ.. వైద్య విద్యార్థులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంటర్న్‌ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపింది.

Local Media : ‘శంకర్‌ దాదా.. ఎంబీబీఎస్’లు!

  • బెంగాల్‌ ఆరోగ్య శాఖలో భారీ కుంభకోణం

  • కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.. స్థానిక మీడియా కథనం

కోల్‌కతా, సెప్టెంబరు 15: పశ్చిమబెంగాల్‌లో వైద్య విద్యలో భారీ కుంభకోణం జరిగినట్లు స్థానిక మీడియా ఆరోపించింది. పలువురు వైద్యులతో కూడిన ఈ శక్తిమంతమైన లాబీ.. వైద్య విద్యార్థులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంటర్న్‌ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పరీక్షల్లో మార్కులు బాగా వేయడం, పాస్‌ చేయించడానికి ముడుపులు తీసుకుంటున్నట్లు, డబ్బులు ఇవ్వనివారిని ఫెయిల్‌ చేస్తున్నట్లు ఆరోపించింది. నార్త్‌ బెంగాల్‌కు చెందిన ఓ వైద్యుడి ఆధ్వర్యంలో ఈ పైరవీలు నడుస్తున్నందున.. దీన్ని ‘నార్త్‌ బెంగాల్‌ లాబీ’గా పేర్కొన్నట్లు తెలిపింది. ఆ వైద్యుడు సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడనీ వెల్లడించింది. గత దశాబ్దకాలంగా రాష్ట్ర ఆరోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలు, ఆస్పత్రుల్లో ఆయన హవా నడుస్తోందని పేర్కొంది. ఈ దందాలో ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు వివరించింది.

టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్న వైద్యుడు కూడా ఈ లాబీలో ఉన్నారని, లాబీ సభ్యులు అధికార టీఎంసీకి చెందిన వైద్య విభాగం ‘తృణమూల్‌ ఛాత్ర పరిషత్‌ (టీఎంసీపీ)’కి చెందిన వారని.. పలువురు జూనియర్‌ వైద్యులు తెలిపినట్లు కథనం పేర్కొంది. అలాగే వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కూడా భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో పోస్టింగులు, బదిలీల విషయంలోనూ ఈ లాబీదే హవా అని తెలిపింది. మొత్తం మీద ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, పీజీలు పాసై వస్తున్న వారిలో అత్యధికులు అనర్హులేనని పేర్కొంది. వారికి వైద్యులయ్యే అర్హత లేదని, కనీస నైపుణ్యాలు కూడా ఉండవని.. లంచాలిచ్చి పరీక్షలు పాసవుతున్నారని తెలిపింది. వారంతా ‘శంకర్‌దాదా.. ఎంబీబీఎ్‌స’లేనని ఆ కథనం తెలిపింది. ఈ లాబీ దందాపై స్థానిక అధికారులతో విచారణ జరిపిస్తే ప్రయోజనం ఉండదని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుకుంటున్నట్లు తెలిపింది.

Updated Date - Sep 16 , 2024 | 04:10 AM